మొదటి నుంచి అంతా ఊహించినట్లుగానే తన ఎమ్మెల్యే పదవికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ రాజీనామా చేశారు.అంతేకాదు పార్టీకి ఏళ్ల తరబడి ఉన్న అనుబంధాన్ని తెగతెంపులు చేసుకున్నారు.
టిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు మీడియా సమావేశంలో ఆయన ప్రకటించారు .ఈ సందర్భంగా టిఆర్ఎస్ అధినేత తెలంగాణ సీఎం కేసీఆర్ పై ఈటెల రాజేందర్ సంచలన విమర్శలు చేశారు.శామీర్ పేట లోని తన నివాసంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసిన రాజేందర్ కెసిఆర్ తీరుతో పార్టీలో తాము ఏ విధంగా ఇబ్బందులు పడ్డాము అనే విషయాన్ని వివరించారు.బతికి ఉండగానే బొంద పెట్టమని కేసీఆర్ ఆదేశించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు .అసలు కెసిఆర్ తో తమకు ఐదేళ్ల క్రితం గ్యాప్ వచ్చిందని, తనతో పాటు హరీష్ రావు కు కూడా పార్టీలో ఇదే రకమైన అవమానాలు ఎదురయ్యాయి అని, అసలు కెసిఆర్ పరిపాలనలో మంత్రి పదవి బానిస కంటే దారుణంగా మారింది అంటూ ఆయన మండిపడ్డారు.
ప్రగతి భవన్ ను బానిస నిలయంగా మార్చుకోవాలని ఈటెల ఎద్దేవా చేశారు.” నా వివరణ తీసుకోకుండా మంత్రివర్గం నుంచి తొలగించారు.కనీసం ఏం జరిగిందో తెలుసుకోకుండా విచారణకు ఆదేశించారు.
పార్టీ కోసం ఎంతో కష్టపడ్డాను బతికి ఉండగానే బొంద పెట్టమని హరీష్ రావు ను సీఎం కేసీఆర్ ఆదేశించారు.నియోజకవర్గ ప్రజలను డబ్బులు ఇచ్చి కొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
నాకు జరిగిన అన్యాయానికి ప్రజలు కూడా బాధపడుతున్నారు.కుట్రలను తిప్పికొడతామని కడుపులో పెట్టుకుని చూసుకుంటామని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, మేం మళ్లీ గెలిపించుకుంటామని చెప్పారు.
అందుకే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నా.19 ఏళ్ల టిఆర్ఎస్ అనుబంధానికి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా.కెసిఆర్ తన సొంత కూతురు కూడా బీఫామ్ ఇచ్చారు కానీ ఆమె ఓడిపోయారు.
ఈటెల రాజేందర్ అనే కార్యకర్త ఎప్పుడూ కూడా ఓడిపోలేదు ” అంటూ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.హుజురాబాద్ ప్రజలు డబ్బులకి లొంగే వారు కాదని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకోరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
త్వరలోనే అన్ని కుట్రలను తిప్పు కొడతాము అంటూ రాజేందర్ సవాల్ విసిరారు.