టిఆర్ఎస్ నుంచి అవమానకర రీతిలో బయటకు వచ్చి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బిజెపి నుంచి గెలిచిన హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆషామాషీగా అయితే టిఆర్ఎస్ ను వదిలిపెట్టేలా కనిపించడం లేదు.ఏదో రకంగా ఆ పార్టీని బలహీనం చేసి పెద్ద ఎత్తున నాయకులను బిజెపిలో చేరేలా చేయడం ద్వారా బీజేపీ తన గ్రాఫ్ పెంచుకోవడంతో పాటు, టీఆర్ఎస్ ను బలహీనం చేయవచ్చనే విషయంపై దృష్టి సారించారు.
ఈ మేరకు ఆయన చేరికలపై పూర్తిస్థాయిలో దృష్టిపెట్టారు.టిఆర్ఎస్ లో ఉద్యమం కాలం నుంచి పని చేస్తూ సరైన ప్రాధాన్యం దక్కని వారిని, అసంతృప్త నేతలను గుర్తించి వారిని బిజెపిలో చేర్చుకునే వ్యూహాల్లో రాజేందర్ నిమగ్నమయ్యారు.
దీనికోసం జిల్లాలు నియోజకవర్గాలు , మండలాలు వారీగా ఎవరెవరు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే విషయంపైన లిస్ట్ రెడీ చేసుకుంటున్నారు.
పెద్ద ఎత్తున ఉద్యమ నాయకులను బీజేపీలో చేర్చుకుని పార్టీని మరింత బలోపేతం చేయడం ద్వారా అధిష్టానం పెద్దల వద్ద తన పలుకుబడి పెంచుకోవచ్చనే లక్ష్యంతో రాజేందర్ ఉన్నారు.
అందుకే ముఖ్యంగా టిఆర్ఎస్ పై పూర్తి స్థాయిలో ఫోకస్ పెంచారు. టి ఎస్ పి ఎస్ సి మాజీ సభ్యుడు విటల్ సైతం త్వరలోనే రాజేందర్ సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.
అలాగే కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవి ప్రసాద్, అలాగే ఉద్యోగ జేఏసీ నేత, ఓ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తో పాటు , మెడికల్ జేఏసీ కి చెందిన కొంతమంది కీలక నాయకులు ఈటెల రాజేందర్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
అలాగే కరీంనగర్ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్సీ ఉద్యోగ సంఘం నేత కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.టిఆర్ఎస్ లో ఇప్పటికీ ఉద్యమ కాలం నాటి నాయకులు చాలామంది దూరమయ్యారు.ఇంకా మిగిలిన కొద్ది మందిని టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేర్చగలిగితే బిజెపి మరింత బలపడుతుందని, తన ఇమేజ్ కూడా బాగా పెరుగుతుందనే లెక్కల్లో రాజేందర్ ఉన్నారట.
దీనికితోడు టిఆర్ఎస్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు బిజెపి వైపు వచ్చేందుకు బిజెపి నేతల్ని సంప్రదిస్తూ ఉండటం , టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ కు ఆందోళన కలిగిస్తోందట.