తెలంగాణలో ఇప్పుడు ప్రతి పార్టీ పాదయాత్రల మీదే ఫోకస్ పెట్టింది.ముఖ్యంగా కాంగ్రెస్ బిజెపి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ తో సహా అందరూ పాదయాత్రనే నమ్ముకుంటున్నారు.
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు జిల్లాల వారీగా తెలంగాణ అంతటా తిరుగుతూ, బీజేపీ అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆయన ముందుకు వెళ్లేలా ప్లాన్ చేసుకున్నారు.అలాగే కొత్తగా తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసేందుకు సిద్ధం అవుతున్నారు.
ఇక ముందు నుంచి షర్మిల సైతం పాదయాత్ర మీదే ఎక్కువ ఫోకస్ పెట్టారు.దాని కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు.
ఇదిలా వుంటే ఇటీవల టిఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన ఈటెల రాజేందర్ ఇప్పుడు పాదయాత్ర ఆలోచనలో ఉన్నారు.
త్వరలోనే హుజూరాబాద్ నియోజకవర్గం లో ఎన్నికలు ఎదుర్కోవాల్సి ఉండటంతో అధికార పార్టీ టిఆర్ఎస్ ప్రభావం ఏమాత్రం కనిపించకుండా చేసేందుకు ఆయన నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.ఈ పాదయాత్రను బత్తిని వారి పల్లి నుంచి మొదలు పెట్టేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు.రాబోయే రెండు, మూడు రోజుల్లో రాజేందర్ పాదయాత్ర చేపట్టబోతున్నట్టు ఈటెల అనుచరులు చెబుతున్నారు.
ఈ యాత్రలో నియోజకవర్గంలోని ప్రతి పల్లె కవర్ అయ్యే విధంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మొత్తంగా 400 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టేలా ప్లాన్ చేసుకున్నారు.
ఇంకా ఆగస్టు 9 నుంచి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేపట్టబోతుండగా, ఆగస్టు 8 నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర ప్రారంభం కాబోతోంది.ఇక రేవంత్ పాదయాత్ర తేదీపై క్లారిటీ అయితే లేదు.వరుసగా తమ రాజకీయ ప్రత్యర్థులు అంతా పాదయాత్రలు చేపడుతూ ఉండడంతో , అధికార టీఆర్ఎస్ దీనికి దీటుగా ఏం చేయాలనే దానిపై ఫోకస్ పెట్టింది.ఈ పాదయాత్రలు సక్సెస్ కాకుండా చూసేందుకు అన్ని వ్యూహాలనూ రచిస్తోంది.
ఎలా అయినా తెలంగాణలో తమకు తప్ప ఎవరికి అవకాశం లేకుండా చూసేందుకు టిఆర్ఎస్ ఎత్తుకు పై ఎత్తులు వేస్తోంది.ముఖ్యంగా హుజూరాబాద్ లో ఈటెల రాజేందర్ కు గెలుపు దక్కుకుండా చేసేందుకు టిఆర్ఎస్ అన్నిరకాలుగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.