ఎంతో ఉత్కంఠ కలిగించిన హుజురాబాద్ ఉప ఎన్నికలు ఎట్టకేలకు ముగిశాయి.ప్రశాంతంగా ఎన్నికల ప్రక్రియ సాగుతోందని అంతా అంచనా వేసినా, ఎక్కడా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేసినా, చివరకు ఈ నియోజకవర్గంలో పోలింగ్ ప్రక్రియ తీవ్ర గందరగోళానికి కారణం అయ్యింది.
అనేక చోట్ల అల్లర్లు చోటు చేసుకోవడం, టిఆర్ఎస్ బీజేపీ నాయకులు మధ్య వివాదాలు ఏర్పడడం వంటి వ్యవహారాలు ఇబ్బందికరంగా మారాయి.తాజాగా నిన్న జరిగిన పోలింగ్ ప్రక్రియ వ్యవహారంపై బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అధికార పార్టీ వ్యవహరించిందని, ఎన్నిసార్లు సిపి, కలెక్టర్ కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని , అధికారులు ఏకపక్షంగా వ్యవహరించారని రాజేందర్ మండిపడ్డారు.
స్వయంగా ఎమ్మెల్యే లు డబ్బులు పంచిపెట్టినట్టు వార్తలు వస్తున్నాయి అని, ఈవీఎం పాడైందని చెప్పి మార్చడం మరిన్ని అనుమానాలకు కారణం అవుతోందని రాజేందర్ వ్యాఖ్యానించారు.తనను ఓడించేందుకు కెసిఆర్ అన్ని ప్రయత్నాలు చేశారు.
డబ్బులు పంచారు.మందు పంచారు.
బెదిరించారు .భయపెట్టారు.చివరకు పోలింగ్ సిబ్బంది కి కూడా దావత్ ఇచ్చి డబ్బులు ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం చేశారని మీడియా సమావేశంలో రాజేందర్ సంచలన విమర్శలు చేశారు.
అన్ని చేసినా, గెలవలేక ఇటువంటి పనులు చేస్తున్నారని , ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసిన తర్వాత కూడా ఓటు వేసిన బాక్స్ లు కూడా మార్చడం దుర్మార్గమని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నాము అని చెప్పుకొచ్చారు.హుజురాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని, ఇది చారిత్రాత్మక ఘట్టం అని రాజేందర్ వ్యాఖ్యానించారు.కలెక్టర్ తప్పు జరిగిందని చెబుతున్నారని, ఇది మామూలు ఎన్నికలు కావనీ, ఇంత ఉత్కంఠ భరితంగా జరిగిన ఎన్నికల్లో ఇంత నిర్లక్ష్యమా ? ఎంత నీచం అంటూ నిన్న ఎన్నికల ఈ సందర్భంగా తలెత్తిన పరిణామాలపై రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.