టిఆర్ఎస్ మంత్రి కేసీఆర్ మేనల్లుడు హరీష్ రావు ను మాజీ మంత్రి , బీజేపీ నేత ఈటెల రాజేందర్ ఒక పట్టాన వదిలిపెట్టేలా కనిపించడంలేదు.టిఆర్ఎస్ తరఫున హరీష్ రావు కీలకంగా వ్యవహరిస్తూ, పెద్దఎత్తున టీఆర్ఎస్ వైపు తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తుండటం, పూర్తిగా హరీష్ రావు ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టి తన అనుంచారులను టార్గెట్ చేసుకోవడం, ఇలా గత కొంతకాలంగా హరీష్ చేస్తున్న వ్యవహారాలపై ఈటెల రాజేందర్ గుర్రుగా ఉన్నారు.
అయితే ఎక్కడా హరీష్ పై ఘాటు విమర్శలు చేయకుండా, సెంటిమెంట్ అస్త్రాలను రాజేందర్ ఉపయోగిస్తున్నారు.తాజాగా ఆయన గురించి స్పందించిన రాజేందర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
మంత్రి హరీష్ రావు సిద్దిపేటలో ఏ విధంగా అయితే అభివృద్ధి పనులు చేపట్టారో తాను హుజూరాబాద్ నియోజకవర్గం లో అదేవిధంగా అభివృద్ధి చేశానని చెప్పుకొచ్చారు.ఈ సందర్భంగా తనకు ఓట్లు వేయొద్దు అని టిఆర్ఎస్ నాయకులు ఎవరైనా డబ్బులు ఇస్తే, వాటిని తీసుకోవాలని, కానీ మనస్సాక్షి ప్రకారం ఓటు వేసి ధర్మాన్ని గెలిపించాలని ప్రజలను రాజేందర్ కోరుతున్నారు.
హరీష్, తాను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసామని, కానీ ఒక సందర్భంలో కేసీఆర్ హరీష్ ను టార్గెట్ చేసుకుని, ఆయనను ఇబ్బంది పెట్టాలని చూసారు అనే విషయాన్ని రాజేందర్ గుర్తు చేశారు.
హరీష్ కు మంత్రి పదవి ఇవ్వకుండా కొంతకాలం వెయిటింగ్ లో పెట్టారని, ఆ సమయంలో తానే కేసీఆర్ పై ఒత్తిడి పెంచానని, పార్టీ ఒక్కరిదే కాదని తాను గట్టిగా వాదించిన తరువాతే హరీష్ కు కేసీఆర్ మంత్రి పదవి అప్పగించారని రాజేందర్ చెప్పారు.గత కొంతకాలంగా సందర్భం వచ్చినప్పుడల్లా ఇదే అంశాన్ని రాజేందర్ పదేపదే ప్రస్తావిస్తున్నారు.ఈ వ్యవహారంపై గతంలో హరీష్ రావు స్పందించారు.
తన గురించి రాజేందర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నా అంటూ హరీష్ క్లారిటీ ఇచ్చారు.అయినా రాజేందర్ మాత్రం అదేపనిగా హరీష్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ కేసీఆర్ కు ఆయనకు మధ్య గ్యాప్ ఉందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
ఈ విధంగా అయినా హరీష్ హవా తగ్గించేందుకు రాజేందర్ ప్రయత్నిస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి.