గత కొద్ది రోజుల నుంచి తెలంగాణలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.టిఆర్ఎస్ నుంచి బిజెపిలో చేరిన రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, దానిని స్పీకర్ ఆమోదించడంతో ఇక్కడ ఉప ఎన్నికలు రాబోతున్నాయి.
రాజేందర్ కు పోటీగా ఎవరిని రంగంలోకి దింపుదాము అనే విషయంలో చాలా రోజులుగా టిఆర్ఎస్ తర్జనభర్జన పడుతోంది.ఎవరిని అభ్యర్థిగా ఎంపిక చేసినా రాజేందర్ ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ క్రమంలోనే రకరకాల పేర్లు టిఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి.కాంగ్రెస్ సైతం బలమైన అభ్యర్థిని రంగంలోకి దించి గట్టెక్కాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చూస్తున్నారు.
ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అనుభవం రాజేందర్ కు ఉండడంతో, ఆయనను ఢీకొట్టడం ఆషామాషీ కాదనే లెక్కల్లో అన్ని పార్టీలు ఉండగా, అనూహ్యంగా ఈ స్థానం నుంచి ఈటల రాజేందర్ భార్య జమున పేరు తెరపైకి వచ్చింది.స్వయంగా ఆమె తాను హుజురాబాద్ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ ప్రకటించడంతో అందరు షాక్ అయ్యారు.
ఒక్కసారిగా రాజేందర్ భార్య పేరు తెరపైకి రావడం వెనుక కారణాలేంటని విశ్లేషణలో అంతా మునిగిపోయారు.ప్రస్తుతం పోటీ తీవ్రంగా ఉండడం, నియోజకవర్గంలో పరిస్థితులు అన్ని లెక్కలు వేసుకుని రాజేందర్ తన భార్య జమున పేరుని ప్రకటన చేయించినట్లు గా ప్రచారం జరుగుతోంది.
వాస్తవంగా హుజూరాబాద్ నియోజకవర్గం లో మొత్తం ఓటర్లు 2,29,124 కాగా, వీటిలో పురుషుల ఓట్లు 1,14, 313, మహిళల ఓట్లు 1,14,811.ఈ నియోజకవర్గంలో పురుషుల కంటే మహిళల ఓట్లు అధికంగా ఉండడంతో పాటు, రెడ్డి సామాజిక వర్గం ఓట్లు దాదాపు 22 వేల వరకు ఉన్నాయి.రాజేందర్ భార్య రెడ్డి సామాజిక వర్గం నుంచి రావడంతో, ఆ వర్గం ఓట్లతో పాటు, రాజేందర్ సామాజికమైన ముదిరాజుల ఓట్లు తమకే కలిసి వస్తాయనే లెక్కల్లో రాజేందర్ ఉన్నట్లు తెలుస్తోంది.అందుకే ఆమెను ఎన్నికల రంగంలోకి దింపే ఆలోచనతోనే ఈ ప్రకటన చేయించినట్లు అర్థమవుతోంది.