అవును, మీరు వింటున్నది నిజమే.రైతే రాజు అని మన ప్రభుత్వాలు ఉదరగొడతాయి.
కానీ అలాంటి రైతులకు మన దేశంలో ఎలాంటి గౌరవం దక్కుతుందో వేరే చెప్పాల్సిన పనిలేదు.వ్యవసాయంలో స్థిరపడిన పురుషులకి ఇక్కడ వివాహం కూడా జరగదు.
ఎందుకంటే దానిని నమ్ముకొని జీవనయానం కొనసాగించేవారి ఇక్కట్లు అంతాఇంతా కావు.అందుకే ఇక్కడ యువత వ్యవసాయం పట్ల మొగ్గు చూపదు.
అయితే ఇక్కడ వున్న టైటిల్ మనదేశానికి సంబంధించింది కాదండోయ్.UKకి సంబంధించినది.
అక్కడి ప్రభుత్వం వృద్ధులను ఇక రిటైర్ అవ్వమని కోరుతోంది.అలాగే యువతకి ఆ బాధ్యత ఇవ్వమంటోంది.
అక్కడ వ్యవసాయం చేసే వాళ్ళల్లో ఎక్కువగా వృద్ధులే ఉండటం వలన ఆ వృత్తి నుంచి వైదొలిగితే డబ్బులు ఇస్తామని UK ప్రభుత్వం ఓ కొత్త స్కీమ్ తీసుకొచ్చింది.ఇక్కడ ప్రతీ 10 మంది బ్రిటీష్ రైతుల్లో 4 మంది 65 ఏళ్లు పైబడిన వారే కావడం గమనార్హం.
నిజానికి వయసు మీద పడటంతో కొంతమంది రైతులు రిటైర్ అవ్వాలనుకుంటున్నారు కానీ ఆర్థిక కారణాల వల్ల భారమైనా సరే వ్యవసాయాన్ని నమ్ముకుని బండి లాగిస్తున్నారు.దీంతో ఈ వృద్ధ రైతులను వ్యవసాయం నుంచి వైదొలగమని ప్రలోభపెట్టడం సహా యువతను ఇటువైపుగా ప్రోత్సహించేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ‘లంప్ సమ్ ఎగ్జిట్’ అనే స్కీమ్ను తెరమీదకు తీసుకొచ్చింది.
ఇక ఈ పథకం ద్వారా సదరు వృద్ధ రైతులకు లాభం చేకూరనుంది.దీని ద్వారా రైతులు దాదాపు రూ.96 లక్షలు( £100,000) నగదును ప్రభుత్వం నుంచి అందుకునే అవకాశముంది.లంప్ సమ్ ఎగ్జిట్ స్కీమ్ యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, వ్యవసాయం నుంచి నిష్క్రమించాలనుకునే రైతులకు వారి భవిష్యత్తు కోసం ఆర్థిక సహాయం చేయడం.
కొత్తగా వ్యవసాయంలోకి ప్రవేశించే వారికి భూమిని ఉచితంగా అందిచడం.వ్యవసాయ భూమి మరింత అందుబాటులోకి వచ్చినప్పుడు కొత్త, యువ రైతులు ఈ రంగంలోకి ప్రవేశించేందుకు ఇది వీలు కల్పిస్తుంది.