తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగింది.ఏకంగా 52 రోజుల పాటు వారు విధులకు హాజరుకాకుండా సమ్మె చేయడంతో తెలంగాణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అయితే ఇటీవల వారు సమ్మెను విరమిస్తున్నట్లు స్పష్టం చేశారు.కానీ వారిని ఆర్టీసీ యాజమాన్యం విధుల్లోకి తీసుకోలేదు.
దీంతో వారు చాలా ఆందోళనకు గురయ్యారు.కాగా తాజాగా రాష్ట్ర సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికలను ఎలాంటి షరతులు లేకుండా విధుల్లో చేరవచ్చని సూచించారు.దీంతో ఆర్టీసీ కార్మికులు శుక్రవారం ఉదయమే డిపోలకు చేరుకున్నారు.
52 రోజుల సుదీర్ఘ సమ్మె తరువాత కార్మికులు డిపోలకు చేరుకోవడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది.కార్మికులంతా ఒకరిని ఒకరు సంతోషంగా ఆలింగనం చేసుకుంటూ కనిపించారు.ఇన్ని రోజులుగా తాము చాలా ఇబ్బందులు పడుతున్నా ఎవరూ పట్టించుకోలేదని, సీఎం కేసీఆర్ తమను తిరిగి ఉద్యోగంలో చేరేందుకు అంగీకరించడంతో వారందరూ సంతోషం వ్యక్తం చేశారు.
ఎలాంటి షరతులు లేకుండా తమని విధుల్లోకి తీసుకున్న కేసీఆర్కు కార్మికులు ధన్యవాదాలు తెలిపారు.
ఇక ఆర్టీసీ కార్మికులను విధుల్లోకి హాజరవ్వాల్సిందిగా కేసీఆర్ సూచించడం స్వాగతిస్తున్నామని ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్దామరెడ్డి తెలిపారు.
పలువురు రాజకీయ నాయకులు కూడా ఈ అంశంలో కేసీఆర్ సూచనను స్వాగతించారు.అయితే ప్రయాణికులపై చార్జీల పెంపు సరైనది కాదని పలువురు వాదిస్తున్నారు.