విదేశాల్లో స్థిరపడినా తమ కుటుంబం పుట్టి, పెరిగిన గ్రామంతో సంబంధాలు తెంచుకోకూడదనే ఉద్దేశ్యంతో కొందరు ప్రవాస భారతీయులు తమ వారి పేరిట స్మారకాన్ని నిర్మిస్తున్నారు.ఇందులో బతికున్న వారితో పాటు చనిపోయిన బంధువుల పేర్లు, వివరాలు నమోదు చేయిస్తున్నారు.
పంజాబ్లోని జాగ్రావ్ సమీపంలోని బింజాల్ గ్రామానికి చెందిన బహదూర్ సింగ్ కుటుంబీకులు 1966లో భారత్ నుంచి వలసవెళ్లి యూకేలో స్థిరపడ్డారు.ఈ క్రమంలో తమ కుటుంబ మూలాలు దెబ్బ తినకూడదని, తమ గుర్తుగా గ్రామంలో ఏదో ఒకటి ఉండాలనే ఉద్దేశ్యంతో రాయ్కోట్- జాగ్రోన్ రహదారిలో తన పేరిట ఒక స్మారకాన్ని నిర్మించాడు.
ఆయన బాటలోనే బహదూర్ కుటుంబం తాజాగా మరో రెండు నిర్మాణాలు చేపట్టారు.వీటిలో 70 మంది పేర్లు చెక్కించారు.చనిపోయిన వారి పేర్లు నలుపు రంగులో పెయింటింగ్ చేయగా, జీవించివున్న పేరును తెలుపు రంగులో పెయింట్ చేశారు.
ఈ నిర్మాణాలకు సంబంధించి బహదూర్ కుటుంబీకులు ఎప్పటికప్పుడు తమకు వాట్సాప్ ద్వారా వివరాలను పంపుతున్నారని గ్రామంలో వారి కుటుంబానికి పరిచయస్తుడైన లఖ్వీందర్ సింగ్ తెలిపారు.
ఈ స్మారక చిహ్నం వద్ద పార్కింగ్ సౌకర్యంతో పాటు సుందరంగా ఉండేందుకు చెట్లను పెంచుతున్నామని, బహదూర్ సింగ్ అప్పుడప్పుడు గ్రామానికి వచ్చి వీటిని పరిశీలిస్తారని లఖ్వీందర్ చెప్పారు.
బీబీఏ చదువుతున్న బహదూర్సింగ్ కుమారుడు హర్కరన్ సింగ్ మాట్లాడుతూ.
తమ బంధువులు చాలా మంది విదేశాలలో నివసిస్తున్నారని, కానీ వారికి గ్రామంతో భావోద్వేగ సంబంధం ఉండాలనే ఉద్దేశ్యంతో స్మారక చిహ్నంలో వారికి భాగం కల్పించామన్నారు.మరో సభ్యుడు మాట్లాడుతూ ఈ స్మారక చిహ్నం చరిత్రతో పాటు వర్తమానాన్ని కూడా వివరిస్తుందన్నారు.
తొలుత బతికున్న వారి పేర్లు ఉండకూడదని తాను అనుకున్నానని, కానీ దాని వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించామన్నారు.తమ పూర్వీకులు ఉపాధి కోసం 1930లలో ఇంగ్లాండ్ వెళ్లారని, తర్వాత చాలా మంది కుటుంబసభ్యులు అక్కడే స్థిరపడ్డారని 65 ఏళ్ల సుఖ్మీందర్ సింగ్ అనే డ్రైవర్ తెలిపారు.
.