కరోనా వైరస్తో విలవిల్లాడుతున్న అమెరికన్లను బతికించేందుకు ప్రవాస భారతీయ వైద్యులు ప్రాణాలను పణంగా పెట్టి పని చేస్తున్నారు.బాధితులకు చికిత్స అందించే క్రమంలో ఈ మహమ్మారి బారినపడి కొందరు ప్రాణాలు కోల్పోగా.
మరికొందరు తాము సేవలందిస్తున్న చోటే రోగులుగా చేరారు.తాజాగా కోవిడ్ 19 బారినపడి ఇండో అమెరికన్ వైద్యుడు, భారత సంతతికి చెందిన అమెరికన్ వైద్యుల సంఘం (ఏఏపీఐ) మాజీ అధ్యక్షుడు అజయ్ లోధా కన్నుమూశారు. కరోనా వైరస్ బారినపడిన ఆయన గత ఎనిమిది నెలలుగా క్లీవ్ల్యాండ్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 21న తుదిశ్వాస విడిచారు.అజయ్ వయసు 58 సంవత్సరాలు.ఆయనకు భార్య స్మిత, కుమారుడు అమిత్, కుమార్తె శ్వేత ఉన్నారు.అజయ్ లోధా మరణం పట్ల న్యూయార్క్లోని భారత కాన్సులేట్ కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆయన ఎల్లప్పుడూ మన హృదయాల్లో ఉంటారని.సమాజానికి అతను చేసిన సేవలు తమకు స్ఫూర్తిని ఇస్తూనే ఉంటాయని ట్వీట్ చేసింది.
అజయ్ లోధా మరణం ఏఏపీఐ చరిత్రలో చీకటి రోజుగా అభివర్ణించారు వైద్యుల సంఘం అధ్యక్షుడు సుధాకర్ జోన్నలగడ్డ.
2016లో ప్రతిష్టాత్మక ఎల్లిస్ ఐలాండ్ మెడల్ ఆఫ్ ఆనర్తో అజయ్ లోధాను సత్కరించారు.2015-16లో ఏఏపీఐ అధ్యక్షుడిగా పనిచేశారు.అంతకుముందు 2008లో నర్గిస్ దత్ మెమోరియల్ ఫౌండేషన్ ఆయనను ఫిజిషియన్ ఆఫ్ ది ఇయర్తో గౌరవించారు.
రాజస్ధాన్ అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా, రాజస్థాన్ మెడికల్ అలుమ్ని అసోసియేషన్, న్యూయార్క్లోని ఫ్లషింగ్ హాస్పిటల్లో పరిశోధనా విభాగం డైరెక్టర్గానూ సేవలందించారు.వృత్తి రీత్యా అజయ్ లోధా ఇంటర్నిస్ట్గా ఫ్లషింగ్ హాస్పిటల్లో తన రెసిడెన్సీని పూర్తి చేశారు.
కాగా, అమెరికాలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.ఇప్పటి వరకు అగ్రరాజ్యంలో 12.3 మిలియన్ల మంది కోవిడ్ బారిన పడగా.2.5 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోయారు.