భారత్లో షోరూంలు, సర్వీస్ సెంటర్లను స్థాపించి లేదా ఎంపిక చేసుకొని టెస్లా కార్లను స్థానికంగా విక్రయించాలని ఎలాన్ మస్క్ అనుకున్నారు.దీనితో టెస్లా కార్లను ఇండియాలోనే కొనుగోలు చేయవచ్చని వాహనదారులు కూడా సంతోష పడ్డారు.
అయితే వారి సంతోషం ఎంతో కాలం నిలవలేదు.తాజాగా ఎలాన్ మస్క్ టెస్లా కార్లను ఇండియాకి తీసుకొచ్చి విక్రయించే ప్రయత్నాలను మానుకున్నారు.
ఇందుకు కస్టమ్స్ టాక్స్ విషయంలో ఇటు ఇండియా గానీ అటు మస్క్ ఒక పరస్పర సానుకూల నిర్ణయానికి రాకపోవడమే.
ఎలక్ట్రిక్ కార్లపై దిగుమతి సుంకం తగ్గించాలని కొద్ది రోజులుగా మస్క్ ఇండియాతో చర్చలు జరుపుతున్నారు.
అవి ఎప్పుడూ విఫలమే అవుతున్నాయి.ఇటీవల కూడా ఆ చర్చలు సఫలం కాకపోవడంతో ఆయన తన కార్లను ఇండియాలో విక్రయించే ప్రయత్నాలను శాశ్వతంగా విరమించుకున్నట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి.
టెస్లా కార్లను ఇండియాలోనే తయారు చేయాలని మస్క్ కి ఇండియా ఎప్పటినుంచో విజ్ఞప్తి చేస్తోంది కానీ అందుకు అతను నిరాకరిస్తూ వస్తున్నారు.కార్ల విక్రయానికి ముందు ఇండియాలో టెస్లా కార్లు తయారు చేయడం నచ్చకే అతను తన ప్రయత్నాలను విరమించుకున్నట్లు తెలుస్తోంది.
టెస్లా సంస్థ ఎలక్ట్రిక్ కార్లను అమెరికా, చైనా దేశాల్లో తయారు చేస్తోంది.ఈ కార్లను భారత్లో దిగుమతి చేసి అమ్మాలని కొద్ది సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తోంది.
అయితే విక్రయించడానికి బదులు తయారీ యూనిట్ను స్థాపించి ఇక్కడ తయారుచేసిన కార్లను ఇక్కడే విక్రయించాలని ఇండియా కోరుతూ వస్తోంది.మస్క్ మాత్రం తొలత విదేశాల్లో తయారుచేసిన కార్లను ఇండియాలో సేల్ చేస్తామని, తర్వాతనే తయారీ యూనిట్ను స్థాపిస్తామని అంటున్నారు.అలానే ఎలక్ట్రిక్ కార్ల దిగుమతిపై ఉన్న ట్యాక్స్ తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.మేక్-ఇన్-ఇండియా లక్ష్యంలో మస్క్ భాగస్వామ్యం అయ్యేందుకు ఆసక్తి చూపించడం లేదు కాబట్టి దిగుమతి సుంకం తగ్గించేందుకు కూడా భారత్ ఏమాత్రం ఆసక్తి కనబర్చలేదు.
దీంతో చేసేది లేక మస్క్ తన కార్ల విక్రయాల ప్రయత్నాలను బ్రేక్ వేసినట్లు సమాచారం.