ఆలూ లేదు సూలి లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టుగా తయారయ్యాయి తెలంగాణ రాజకీయ పార్టీలు, నాయకుల పరిస్థితి.సార్వత్రిక ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉంది.
హుజురాబాద్ ఎన్నికలకూ దాదాపు ఐదు నెలలకు పైగా సమయం ఉంది.అయినా అప్పుడే అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికలు ముంచుకు వచ్చేసినట్టుగా హడావుడి పడుతున్నాయి.
పర్యటన లు, అభివృద్ధి కార్యక్రమాలు , ప్రారంభోత్సవాలు అంటూ అధికార పార్టీ టిఆర్ఎస్ హడావుడి చేస్తుండగా, అంతే స్థాయిలో కాంగ్రెస్ , బీజేపీ లు కంగారు పడుతున్నాయి.మొన్నటి వరకు పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్టుగా కనిపించినా, ఈటెల రాజేందర్ ను ఎప్పుడైతే మంత్రివర్గం నుంచి కేసీఆర్ బర్తరఫ్ చేయించారో అప్పటి నుంచి తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి.
ఉప ఎన్నికలు రేపో మాపో అన్నట్టుగా అన్ని పార్టీలు కంగారు పడిపోతుండడంతో జనాల్లోనూ ఆసక్తి పెరిగిపోయింది.
బీజేపి టీఆర్ఎస్ మధ్య మాత్రమే పోటీ అన్నట్టుగా పరిస్థితి కనిపించినా, అనూహ్యంగా తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ని నియమించడంతో ఒక్కసారిగా తెలంగాణ లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి.
రేవంత్ కారణంగా ముందుగా అన్ని పార్టీలు వేసుకున్న అంచనాలు తలకిందులయ్యాయి.ఈరోజు పిసిసి అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ కు భారీ స్థాయిలో అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, భారీగా బైక్ , కార్ ర్యాలీ లు నిర్వహించడం, తెలంగాణ కాంగ్రెస్ లో ఒక్కసారిగా గా ఊపు కనిపించడం, బిజెపి, టిఆర్ఎస్ పార్టీలను ఆందోళనకు గురి చేస్తుండడంతో కాంగ్రెస్ లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.
ఇక తెలంగాణ సీఎం కేసీఆర్ అయితే ఎప్పుడు లేని విధంగా జిల్లా పర్యటనలు, తనిఖీలు అంటూ తీరికలేని షెడ్యూల్ తో గడుపుతున్నారు.
ఇప్పటికే ఆయన సిద్దిపేట, కామారెడ్డి, వరంగల్ జిల్లాలో అనేక ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు.ఇక తాను తరుచుగా జిల్లాల పర్యటనకు వెళ్తాను అంటూ ప్రకటించారు.20వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాను అంటూ ప్రకటించారు.అలాగే ఉప ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాలను హైలెట్ చేశారు.పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా అక్రమంగా నీటిని వాడుకుంటోంది అంటూ తెలంగాణ ప్రజల్లో కాక రేపే విధంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారు.
ఇక బీజేపీ అంతే స్థాయిలో కంగారు పడుతోంది.ఉప ఎన్నిక అత్యంత ప్రతిష్టాత్మకం కావడం, బిజెపి అభ్యర్థిగా ఈటెల రాజేందర్ స్వయంగా రంగంలోకి దిగడం, ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి పోటీ తీవ్రంగా ఉండడం వంటి పరిణామాలతో ఇప్పుడు ఉప ఎన్నికలే కాకుండా రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తగిన వ్యూహాలు రూపొందించుకుంటోంది.ఈ విధంగా అప్పుడే అన్ని పార్టీల్లోనూ సార్వత్రిక ఎన్నికల మూడ్ వచ్చేసినట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.