ఏపీలో అధికారం దక్కించుకునేందుకు అష్టకష్టాలు పడుతూ… రాష్ట్రమంతా పాదయాత్ర చేసి మరి జగన్ ప్రజల్లో పరపతి పెంచుకున్నాడు.ఇక తెలుగుదేశం పార్టీ ప్రకటిస్తున్న ఎన్నికల వాగ్దానాలకు మించి జగన్ కూడా వాగ్దానాలు చేస్తూ… ప్రజల్లోకి దూసుకెళ్తున్నారు.
ఇప్పటికే వైసీపీ గాలి ఏపీలో బలంగానే వీస్తున్నట్టు అనేక సర్వేల్లో తేలడంతో పార్టీలో జోష్ పెరిగింది.ఈ లోపుగానే ఓ చిన్నపాటి ఎదురు దెబ్బ తగిలింది కేంద్ర ఎన్నికల సంఘం ఆయనకు జగన్ కు నోటీసులు జారీ చేయడంతో ఇప్పుడు వైసీపీ లో కలకలం రేపుతోంది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకుడు శివ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీచేసింది.
మార్చి 11 లోపు జగన్ వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.
యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ పేరుతో శివకుమార్ అనే లాయర్ స్థాపించి రిజిస్టర్ చేసుకోగా… అతని దగ్గర నుండి జగన్ పార్టీ తీసుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికీ పార్టీ అధ్యక్షుడిగా జగన్, వ్యవస్థాపకుడిగా శివకుమార్ ఉన్నారు.ఇప్పటివరకు శివకుమార్ తెలంగాణ జనరల్ సెక్రటరీగా పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.ఈ మధ్య జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో వైసీపీ మద్దతు కాంగ్రెస్ పార్టీ కి అంటూ… ప్రకటించి జగన్ ఆగ్రహానికి గురయ్యారు.అప్పుడే ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
అసలు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసే అధికారం జగన్ కు ఎక్కడుందని… వైసీపీ పార్టీ తనదేనని , వ్యవస్థాపక నియమ నిబంధనలు జగన్ పక్కన పెట్టారని ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
అంతేకాకుండా పార్టీని తనకు స్వాధీనం చేయాలని డిమాండ్ చేశారు.అందుకు అవసరమైన బల నిరూపణ చేసుకోవడానికి తాను సిద్ధమని శివ కుమార్ ప్రకటించి వైసీపీలో కలకలం సృష్టించారు.అయితే శివ కుమార్ వ్యవహారం పై వైసీపీ పెద్దగా స్పందించినట్టు కనిపించడం లేదు.
ప్రస్తుతం జగన్ కు నోటీసులు అందడంతో ఈ వ్యవహారం పై న్యాయ నిపుణులతో చర్చించి అప్పుడు స్పందించాలని జగన్ భావిస్తున్నట్టు వైసీపీ నాయకులూ వ్యాఖ్యానిస్తున్నారు.ఏమైనా ఎన్నికల సమయంలో ఈ వ్యవహారం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తోంది.