గడిచిన కొన్ని రోజులుగా ఊహకందని ట్విస్టులతో సాగుతున్న మరాఠా రాజకీయం కీలక మలుపు తిరిగింది.ఉద్ధవ్ థాక్రే రాజీనామాతో బీజేపీ, రెబల్స్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు దీరుతుందని.
దేవేంద్ర ఫడ్నవీస్ ముచ్చటగా మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని అంతా భావించారు.కానీ ఇక్కడే బీజేపీ వ్యూహం మార్చింది.
ఉద్దవ్ థాక్రే సర్కారును కూలదోశామన్న అప్రతిష్ట రాకుండా జాగ్రత్తలు తీసుకుంది.దీనిలో భాగంగా అందరికీ షాకిస్తూ శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే మహారాష్ట్ర సీఎం అవుతారని స్వయంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.దీంతో మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ షిండే ఈ రోజు రాత్రి 7.30 గంటలకు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
మరోవైపు ప్రభుత్వంలో తాను భాగం కాలేనని మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పష్టం చేశారు.హిందుత్వ, బాల్ థాక్రే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఎన్సీపీ, కాంగ్రెస్ లతో ఉద్ధవ్ థాక్రే కలిశారని.
సంకీర్ణ ప్రభుత్వం నుంచి బయటకు రావాలని షిండే వర్గం పలుమార్లు కోరినా స్పందన లేదని ఫడ్నవీస్ ఆరోపించారు.ఈ కారణంగానే శివసేనలో చీలిక వచ్చిందని ఆయన తెలిపారు.
ఫడ్నవీస్ నిర్ణయం నేపథ్యంలో షిండే వర్గంలోని కీలక నేతలకు మంత్రి పదవులు దక్కే అవకాశం వుంది.అటు దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసల వర్షం కురిపించారు ఏక్ నాథ్ షిండే.
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన సంఖ్యా బలం ఉన్నప్పటికీ ఫడ్నవీస్ పెద్ద మనసుతో సీఎం పదవిని వదులుకున్నారని ఇందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ఏక్ నాథ్ షిండే చెప్పారు.
అంతకుముందు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్ నాథ్ షిండేలు కలిశారు.ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన మెజార్టీ తమకు వుందని.అందుకు అవకాశం కల్పించాలని వారిద్దరూ గవర్నర్ కు వినతిపత్రం అందజేశారు.ఈ మేరకు ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన లేఖలను వారిద్దరూ గవర్నర్ కు సమర్పించారు.
ఆటోడ్రైవర్ నుంచి సీఎం స్థాయికి:
ఏక్ నాథ్ షిండే ఆటోడ్రైవర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు.1980లలో శివసేన కార్యకర్తగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.అనతికాలంలోనే బాల్ థాక్రే ముఖ్య అనుచరుల్లో ఒకరిగా మారిపోయారు.1997లో థానే కార్పోరేటర్ గా గెలిచిన షిండే.2004 నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.