ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్, రోజురోజుకూ మరింత విజృంభిస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తుంది.ఇప్పటికే చాలా మంది ప్రాణాలను హరించిన ఈ మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా తన పంజా విసురుతూ వెళ్తోంది.
కాగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వైరస్ కారణంగా వేల మంది ఆసుపత్రి పాలవుతున్నారు.ఇక మరణాలు కూడా రోజురోజుకూ పెరుగుతుండటంతో ఇక్కడి ప్రభుత్వాలు నివారణ చర్యలు చేపడుతున్నాయి.
అయితే సినీరంగంలో కూడా కరోనా వైరస్ కలకలం రేపింది.ఇప్పటికే సీరియల్, సినిమాల్లో నటిస్తున్న పలువురికి కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ అయ్యింది.దీంతో సినిమా, సీరియల్ షూటింగ్లలో పాల్గొనేందుకు నటీనటులే కాకుండా టెక్నీషియన్లు కూడా ఎవరూ ఆసక్తి చూపడం లేదు.కాగా తాజాగా టాలీవుడ్కు చెందిన యంగ్ హీరో శ్రీనివాస్ మంగం అలియాస్ శ్రీ తండ్రి మంగం వెంకట దుర్గా రామ్ ప్రసాద్ కరోనా బారిన పడి మృతి చెందారు.
గత 20 రోజులుగా కరోనా బారిన పడి సతమతమవుతున్న ఆయన విజయవాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆయన మృతి పట్ల తమ సానుభూతిని తెలిపారు.
గతంలో దర్శకుడు మారుతి డైరెక్ట్ చేసిన ‘ఈ రోజుల్లో’ సినిమాలో శ్రీ హీరోగా నటించాడు.ఇలా సినిమా రంగానికి చెందిన ఫ్యామిలీలో ఓ వ్యక్తి కరోనా బారిన పడటంతో సినీ జనాల్లో మళ్లీ కరోనా భయం పుట్టుకొచ్చింది.
ఈ మహమ్మారికి మందు ఎప్పుడు కనిపెడతారా అని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు.ఏదేమైనా కరోనా బారిన పడకుండా ఎవరిని వారే కాపాడకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది.