తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎక్కడా ‘ఆంధ్ర’ పేరు కనబడకూడదు.ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న నేమ్ ప్లేట్లు వెంటనే తీసేయాలి.
ఇదీ తెలంగాణ ప్రభుత్వ ఆదేశం.ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి పూర్తిగా తెలంగాణదేనని, దాని ఆస్తులు, భవనాలు తెలంగాణకే చెందుతాయని హైకోర్టు తీర్పు ఇచ్చిన తరువాత తెలంగాణ ప్రభుత్వానికి కొండంత బలం వచ్చింది.
దీంతో తెలంగాణ విద్యా సంస్థలన్నీ తెలంగాణ పేరు మీదనే ఉండాలని, ఆంధ్ర పేరు కనబడకూడదని పంతం పట్టింది.హైకోర్టు ఉత్తర్వులను సుప్రీం కోర్టులో ఛాలెంజ్ చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించుకున్నప్పటికీ తన పని తాను చేసుకుపోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ ఇంటర్మీడియట్ బోర్డుకు నాంపల్లిలో కేటాయించిన భవనం ఖాళీ చేయాలని తెలంగాణ ఇంటర్ బోర్టు అధికారులు ఆదేశించారు.ఉమ్మడి రాష్ర్టంలో నూటయేడు విద్యా సంస్థలు ఉండగా, వాటిల్లో తొంభైయేడు సంస్థలు తెలంగాణలోనే ఉన్నాయి.
రాష్ర్ట విభజన జరిగిన ఏడాది లోగా విద్యా సంస్థలను విభజించాల్సి ఉంది.అయితే అన్ని సంస్థల విభజన పూర్తి కాలేదు.
ఏపీ విద్యా సంస్థలు ఉన్న భవనాలన్నింటినీ రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవమైన జూన్ రెండో తేదీలోగా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించుకుంది.ఆంధ్రప్రదేశ్కు ప్రస్తుతం రాజధాని లేదు కాబట్టి విద్యా సంస్థలను ఒక్కో ఊరిలో పెట్టుకోవాలా? సుప్రీం కోర్టు నిర్ణయాన్నిబట్టి ఆంధ్ర విద్యా సంస్థల భవిష్యత్తు ఉంటుంది.