దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు ఉగ్రరూపం దాల్చుతుండడంతో కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండడంతో దేశవ్యాప్తంగా పలు స్థానాల్లో జరగాల్సిన ఉప ఎన్నికలను వాయిదా వేసింది.
కరోనా వైరస్ వ్యాప్తితో పాటు పలు రాష్ట్రాల్లో వరద పరిస్థితుల దృష్ట్యా లోక్సభ ఉప ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఉప ఎన్నికలు సెప్టెంబర్ 7 వరకు వాయిదా వేసినట్లు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.ఈసీ నిర్ణయంతో అసోం, కేరళ, మధ్యప్రదేశ్, నాగాలాండ్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఎనిమిది అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి.
పరిస్థితులు మెరుపడిన వెంటనే ఎన్నికలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
కాంగ్రెస్ నుంచి జ్యోతిరాదిత్య సింధియా తప్పుకున్న తర్వాత 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మార్చి 10 న బీజేపీలో చేరారు.
అనంతరం వారంతా మధ్యప్రదేశ్ అసెంబ్లీకి రాజీనామా చేశారు.ప్రజా ప్రాతినిధ్య చట్టం -1951, సెక్షన్ 151-ఏ ప్రకారం 22 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలను సెప్టెంబర్ 10 నిర్వహించాల్సి ఉంటుంది.
మధ్యప్రదేశ్ తో పాటు అసోం, కేరళ, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి.కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో గతంలో ఈ ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు వాయిదా పడ్డాయి.