ఎవరి పనిని వారు సక్రమంగా, నిజాయితీగా చేస్తే అవినీతికి లోకంలో తావు ఉండదు అన్న మాట తరచుగా వినిపిస్తూనే ఉంటుంది.ఇలా నీతి సూక్తులు చెప్పేవారు చాల మంది ఉంటే, ఆచరించే వారు భూతద్దం పెట్టి వెతికిన దొరకరు.
అందుకే ఎక్కడ చూడు అవినీతి కంపు గుప్పుమంటూనే ఉంటుంది.
రాజకీయాల్లో అయితే అవినీతి మరక అంటించుకోని నాయకుడు ఒక్కరంటే ఒక్కరు కూడా దాదాపుగా దొరకరు.
ఇకపోతే ఎన్నికల సమయాల్లో జరిగే చిత్రవిచిత్రమైన అన్యాయాలు, అవినీతి పనుల గురించి జరిగే ప్రచారంలో వినిపించే మాట ఏంటంటే ఎన్నికలు నిర్వహించే ఎలక్షన్ కమీషన్ అధికార పార్టీకి అమ్ముడుపోయిందనే మాట.
ఇక్కడ గమనించ వలసిన విషయం ఏంటంటే ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులు ఎలక్షన్ కమీషన్ను తప్పుపట్టడం, వారి విధులు సక్రమంగా నిర్వహించలేదనే ఆరోపణలు చేయడం తరచుగా వినిపిస్తుంటుంది.ఈ క్రమంలో ఈసీ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఎక్కడైనా గానీ ఎన్నికల అధికారులపై చర్యలు తీసుకోవాలంటే తమ అనుమతి తప్పనిసరని, అలా కాదని చర్యల పేరిట ఎన్నికల అధికారులకు వాహనాలు, భద్రత వంటి ఇతర సౌకర్యాలను కుదించే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదని రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు స్పష్టం చేసింది.
ముఖ్యంగా ఎన్నికల అధికారుల పదవీకాలం ముగియక ముందే వారిని సాగనంపడం, కొందరి రాజకీయ భవిష్యత్తు కోసం వీరిని బలి చేస్తున్న ధోరణులు ఎక్కువవుతున్నాయని, ఇలాంటి వేధింపులు ఓ భయానక వాతావరణాన్ని సృష్టించడమే కాకుండా, నిజాయతీగా పనిచేసే అధికారులను మానసికంగా కృంగతీస్తాయని వివరించింది.