ఐక్యరాజ్యసమితి.ప్రపంచ శాంతి పరిరక్షణ కోసమే ఏర్పడిన ఈ సంస్థ తదనంతర కాలంలో విద్య, వైద్యం, బాలల హక్కులు, సంక్షేమం, పర్యావరణం ఇలా అనేక అంశాల్లోనూ అభ్యున్నతి కోసం పాటుపడుతోంది.
ఇలాంటి అత్యున్నత వేదిక మీద ప్రసంగించడం దేశాధినేతలకు కూడా ఒక కల.జీవితంలో ఒక్కసారైనా ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించాలని కోరుకునేవారు ఎందరో.అలాంటి విశ్వవేదికపై ప్రసంగించి చరిత్ర సృష్టించారు ఓ తెలుగింటి మహిళ.ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా ఐరాస నిర్వహించిన కార్యక్రమంలో వివిధ దేశాల నుంచి పాల్గొన్న 45 మందిలో భారత్ నుంచి ఆమెకు అవకాశం దక్కింది.
సముద్ర కాలుష్య నివారణ దిశగా చేపట్టిన కార్యాచరణ, ప్రజల్లో తీసుకొచ్చిన చైతన్యంపై ప్రసంగించి నిపుణుల చేత ఔరా అనిపించుకున్నారు.అలాగని ఆమె ఉన్నత విద్యావంతురాలు కాదు.భారత్ తరపున దౌత్యవేత్తగా కూడా పనిచేయడం లేదు.కేవలం తొమ్మిదో తరగతి చదివిన ఓ సామాన్యురాలు మాత్రమే.
మరి ఆమె చేసింది ఏంటీ.? ఐరాస వేదికపై ఆమెకు ఈ అవకాశం ఎలా వచ్చిందో తెలియాలంటూ ఈ స్టోరీ చదవాల్సిందే.తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసే సంగమ తీరం అంతర్వేది ప్రకృతి అందాలకు నెలవు.ఓ వైపు సముద్రం, మరోవైపు గోదావరి, చుట్టూ కొబ్బరి, వరి తదితర పంటలతో పచ్చటి చీర కట్టినట్టుగా ఆ ప్రాంతం పర్యావరణ ప్రేమికులకు ఎంతో ఇష్టం.
ఇక తూర్పుగోదావరి జిల్లాలో వున్న పుణ్యక్షేత్రాల్లో అంతర్వేది కూడా ఒకటి.ఈ క్షేత్రంలో మూడు పాయలుగా చీలిన గోదావరి నది పాయ వశిష్ట గోదావరి అంతర్వేది వద్ద బంగాళాఖాతంలో సంగమిస్తుంది.
ఈ ఆలయం అతి ప్రాచీనమైనది.ఈ ఆలయంలో నరసింహస్వామి లక్ష్మీ సమేతుడై కొలువుదీరాడు.
ఇక సముద్రంలో వశిష్టనది కలిసే చోటును అన్నచెల్లెళ్ల గట్టు అంటారు.ఇక్కడ సముద్ర నీటి మధ్య కొంత భాగం గట్టు మాదిరిగా పొడవుగా ఇసుక మేట వేసి వుంటుంది.
దానికి అటువైపు ఇటువైపు నీరు వేరు వేరు రంగులలో ఒకవైపు స్వచ్ఛంగా, మరొకవైపు మట్టిగా కనిపిస్తుంది.సముద్ర ఆటు పోటులతో కూడా ఇలాగే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.
అలా ప్రకృతిపరంగా, ఆధ్యాత్మికపరంగా విశిష్ట స్థానం సంపాదించుకున్న అంతర్వేది ప్రాంతం ప్లాస్టిక్, పాలిథీన్ వ్యర్థాలతో నిండి పోయింది.
ఈ పరిస్థితి స్థానికంగా నివసిస్తున్న దీపిక మనసును కలిచివేసింది.కాలుష్యం నుంచి తీరాన్ని కాపాడి కాలుష్యరహితంగా మార్చేందుకు గ్రీన్ వార్మ్స్ స్మార్ట్ విలేజ్ మూమెంట్, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ఏర్పాటైంది.ఈ సంస్థ ద్వారా సముద్ర తీరాన్ని కాలుష్య రహితంగా తీర్చిదిద్దేందుకు దీపిక తీవ్రంగా కృషి చేశారు.
ఈ విషయం ఐక్యరాజ్యసమితి దాకా చేరింది.దీంతో ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా దీపికకు ఐరాస వెబ్ టీవీలో ప్రసంగించే అవకాశం కల్పించింది.
ఐక్యరాజ్యసమితి ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి దీపిక ప్రసంగించారు. పాలిథీన్ వ్యర్థాలను ఏరివేయడంతో అంతర్వేది ఆహ్లాదంగా మారినట్టు ఆమె తెలిపారు.మా గ్రామం ఎంతో ఆహ్లాదకరమైన గ్రామం.గోదావరి, సముద్రంలో కలిసే చోటును చూడటానికి దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తుంటారు.
ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల గోదావరి నది, సముద్రం కలుషితమైపోతున్నాయని.దాని వల్ల మత్స్య సంపద నశించిపోతోందని దీపిక తెలిపారు.
దీనిని చూసి ఎంతో బాధపడ్డ తానూ నా భర్త, కలిసి బీచ్ చుట్టుపక్కల ఉండే ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించామని వెల్లడించారు.జీరో వేస్ట్ ప్రాజెక్ట్ తమ గ్రామానికి రావడం సంతోషంగా వుందని ఐక్యరాజ్యసమితి వెబ్ టీవీలో దీపిక తెలిపారు.
ఆమెకు ఐక్యరాజ్యసమితి వేదికపై ప్రసంగించే అవకాశం రావడంపై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ ప్రశంసించారు.ఈ సదస్సులో భారతదేశం నుంచి దీపిక పాల్గొనడం అభినందనీయమని ఆయన ట్వీట్ చేశారు.