దాదాపు కొన్ని నెలల కాలం నుంచి ఈ ప్రపంచం పై కరోనా మహమ్మారి విజృంభించి ఎంతో మంది జీవితాలు రోడ్డున పడేలా చేసింది.ఎటువంటి పనులు లేక, ఉన్న ఉద్యోగాలు కాస్త పోవడంతో వారి బ్రతుకు బండి లాగడం ఎంతో కష్టమైంది.
ఒకవైపుచేతిలో సంపాదన లేక, మరోవైపు నిత్యవసర వస్తువుల ధరలు అమాంతం పెరగడంతో వాటిని కొనే పరిస్థితి ఏర్పడక ఎంతోమంది ఆకలి కేకలు వేశారు.మరికొందరు ఏవో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటూ వారి జీవనాన్ని సాగిస్తున్నారు.
లాక్ డౌన్ సమయంలో వలస కార్మికుల పరిస్థితి అగమ్యగోచరం.ఉన్న చోట పని దొరకక, సొంతూరుకు వెళ్లాలంటే బస్సులు,రైళ్లు తిరగక నానా అవస్థలు పడ్డారు.సొంతగూటికి చేరుకోవాలనే ఉద్దేశంతో కొన్ని వందల కిలోమీటర్లు కాలినడకన పయనమయ్యారు.సొంతగూటికి చేరుకునే లోపే కొందరు కానరాని లోకాలకు వెళ్ళిన పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి.
కానీ జీవనం సాగించాలంటే ఏదో ఒక పని చేయాలనే సంకల్పంతో, కుటుంబ పోషణ భారమైనప్పుడు ఏదో ఒక పని కచ్చితంగా చేసి బ్రతకాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఇలాంటి తరుణంలోనే ఉత్తరాఖండ్ లోని అల్మోడా జిల్లా, నోవాడా గ్రామంలో నివాసం ఉంటున్న దాన్ సింగ్ అనే వ్యక్తి ఢిల్లీ మెట్రో స్టేషన్లో ఉద్యోగం చేసేవాడు.
కానీ లాక్ డౌన్ కారణంగా అతని ఉద్యోగం పోయింది.కుటుంబ పోషణ భారమైన నేపథ్యంలో దాన్ సింగ్ వేరే చోట ఎన్నో ఉద్యోగాలకు ప్రయత్నం చేశాడు కానీ ఎలాంటి ఫలితం లభించలేదు.
చేసేదేమీలేక దాన్ సింగ్ తన గ్రామంలోనే హెర్బల్ టీ తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు.
దాన్ సింగ్ హెర్బల్ టీ తయారు చేసి అమ్మడం ద్వారా అతని సంపాదన నెలకు లక్షల్లో పెరిగింది.
ఇంతకీ ఆ హెర్బల్ టీ ప్రాముఖ్యత ఏమిటంటే… ఆ ప్రాంతంలో లభ్యమయ్యే ఒక ప్రత్యేకమైన గడ్డి మొక్కను తలనొప్పి, జలుబు, జ్వరం వంటి సమస్యలకు వాడుతారు.దాన్ సింగ్ ఆ గడ్డి మొక్క తో హెర్బల్ టీని తయారు చేసి అమ్మడం ప్రారంభించాడు.
అసలే కరోనా టైం కావడంతో వీటికి బాగా డిమాండ్ పెరిగిపోవడంతో నెలకు లక్షల్లో సంపాదన వస్తుందని దాన్ సింగ్ తెలియజేశాడు.