కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు చట్టాలకు వ్యతిరేకంగా గడిచిన 3 నెలలుగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.దాదాపు రెండు నెలల పాటు ఎంతో శాంతియుతంగా, సంయమనంతో నడిచిన అన్నదాతల ఆందోళన జనవరి 26న మాత్రం కట్టుతప్పింది.
కోర్టు నుంచి అనుమతి తెచ్చుకుని మరి రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు.అయితే రైతుల ముసుగులో కొన్ని అరాచక శక్తులు రాజధానిలో విధ్వంసాన్ని సృష్టించాయి.
బారికేడ్లను, వాహనాలను, భద్రతా వలయాన్ని చేధించుకుని వచ్చిన కొందరు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు.ముఖ్యంగా ఎర్రకోటను ముట్టడించి అక్కడ త్రివర్ణ పతాకం స్థానంలో రైతు సంఘాల జెండాలను, ఖలీస్తానీ పతాకాలను ఎగురవేశారు. అంతేకాకుండా పోలీసులపై కర్రలు, ఇనుప రాడ్లతో దాడులకు పాల్పడ్డారు.ఇక ఆ తర్వాతి నుంచి రైతుల ఉద్యమంలో ఖలీస్తానీల పాత్ర ఏంటో బయటపడింది.అదే సమయంలో టూల్ కిట్ వ్యవహారం ప్రకంపనలు సృష్టించింది.అయితే ఎర్రకోట వద్ద హింసకు సూత్రధారులు, పాత్రధారుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.
ఇందుకు సంబంధించి తాజాగా ఇద్దరిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.దొంగ పత్రాలు సృష్టించి దేశం విడిచి పారిపోవాలనుకున్న భారత సంతతి డచ్ దేశస్థుడు సహా మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
వీరిని మణీందర్ జీత్ సింగ్, ఖేమ్ ప్రీత్ సింగ్లుగా గుర్తించారు.
భారత సంతతికి చెందిన డచ్ దేశస్థుడు మణీందర్ జీత్ సింగ్కు నేర చరిత్ర వుందని పోలీసులు తెలిపారు .అతను బ్రిటన్ లోని బర్మింగ్ హాంలో ఉంటున్నాడని వెల్లడించారు.గణతంత్ర దినోత్సవం నాడు జరిగిన హింసలో మణీందర్ హస్తం ఉందని, నకిలీ పత్రాలు సృష్టించి దేశం విడిచి పారిపోతుండగా ఢిల్లీ విమానాశ్రయంలో పట్టుకున్నట్లు ఉన్నతాధికారులు పేర్కొన్నారు.
మరో నిందితుడు ఖేమ్ ప్రీత్ సింగ్.ఎర్రకోటలో డ్యూటీ చేస్తున్న పోలీసులపై బల్లెంతో దాడి చేశాడని చెప్పారు.
తాజా అరెస్టులతో ఈ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.నిందితులను పట్టుకునేందుకు ఢిల్లీ, పంజాబ్లలో పోలీసులు అనేక చోట్ల దాడులు చేశారు.
అరెస్ట్ భయంతో మణీందర్ జీత్ సింగ్ దేశం విడిచిపారిపోవాలనుకున్నాడు.ఢిల్లీ నుంచి నేపాల్, అక్కడి నుంచి బ్రిటన్ కు వెళ్లిపోవాలని అతను ప్లాన్ వేశాడు.
ఇప్పటికే మణీందర్పై ఆయుధ చట్టంతో పాటు ఇతర కేసులూ ఉన్నాయి.పోలీసులు అతనిని కోర్టులో హాజరుపరచగా.
న్యాయస్థానం కస్టడీకీ అప్పగించింది.
మరోవైపు తాను ఉద్దేశపూర్వకంగానే ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొన్నానని, తనతో పాటు మరికొందరినీ కూడా ఢిల్లీ తీసుకొచ్చానని ఖేమ్ ప్రీత్ సింగ్ నేరాన్ని అంగీకరించాడు.
అతను సంజయ్ గాంధీ ట్రాన్స్పోర్ట్ నగర్ నుంచి బయల్దేరి బురారి, చట్టా రెయిల్ వద్ద బారికేడ్లను దాటుకుని ఎర్రకోటకు చేరుకున్నట్లు వెల్లడించాడు.