నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చెందిన తర్వాత, రాజకీయంగా అజ్ఞాతవాసం గడుపుతున్న సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మళ్లీ తెలంగాణ పాలిటిక్స్ లో యాక్టివ్ అవ్వాలని చూస్తున్నారు.దీనిలో భాగంగానే ఆమెకి స్థానిక సంస్థల కోటా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి, మంత్రిని చేయాలనే ఆకాంక్షతో సీఎం కేసీఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇప్పటికే ఆమె నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖలు చేశారు.కాకపోతే కరోనా వైరస్ ప్రభావం కారణంగా, ఆ ప్రక్రియ ముందుకు కదలడం లేదు.
ఇదిలా ఉంటే దుబ్బాక నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా విజయం సాధించిన సోలిపేట రామలింగారెడ్డి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మరణించడంతో, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమైంది.
ఇప్పటికే ఆ స్థానం నుంచి కాంగ్రెస్, బీజేపీలు పోటీ చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నాయి.
ఈ పరిస్థితుల్లో సోలిపేట రామలింగారెడ్డి కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఆ అవకాశం కల్పిస్తారనే ప్రచారం జరుగుతోంది.ఈ సందర్భంగా కవిత పేరు తెరపైకి వచ్చింది.దుబ్బాక నుంచి కవిత పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు అనే ప్రచారం ఇప్పుడు టిఆర్ఎస్ లో ఊపు అందుకుంది.ఇక్కడ పోటీ చేస్తే రికార్డు స్థాయి మెజారిటీ లభిస్తుందని, అందుకే ఆమె ఈ స్థానంపై కన్నేసినట్టు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే రామలింగారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
కెసిఆర్ వెంటే నడుస్తూ వస్తున్నారు.ఈ నేపథ్యంలో ఆయన మరణించడంతో ఆయన కుటుంబ సభ్యులకు కాకుండా, కవితను పోటీకి దింపుతారు అనే ప్రచారంపైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదే సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కవిత దుబ్బాక నుంచి పోటీ చేయరని, ఆమె స్థానిక సంస్థల నుంచి పోటీ చేసేందుకు ఇప్పటికే నామినేషన్ దాఖలు చేయడంతో, మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశమే లేదని మరికొందరు వాదిస్తున్నారు.కానీ కవిత రంగంలోకి దిగడం ఖాయమనే ప్రచారం ఊపందుకోవడంతో ఇక్కడ ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇప్పటికే తెలంగాణలో బలపడాలని చూస్తున్న బిజెపి ఈ ఉప ఎన్నికల్లో గెలిచి చూపించి తమ సమర్థత చాటుకోవాలని చూస్తుండగా, ఉనికి కోసం పోరాడుతున్న కాంగ్రెస్ సైతం ఈ స్థానాన్ని హస్తగతం చేసుకోవాలని ప్లాన్ చేసుకుంటోంది.ఈ పరిస్థితుల్లో కెసిఆర్ కానీ, కవిత గానీ ఇప్పటి వరకు ఈ విషయంపై స్పందించకపోవడంతో, వారు ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠగా మారింది.