వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా సరే… చాలా మందికి అరచేతులు పొడిగా మారటం, పాదాలు పగుళ్లు వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అయితే చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవటం ద్వారా ఈ సమస్యల నుండి చాలా సమర్ధవంతంగా బయట పడవచ్చు.
ఆ జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
చేతులు,కాళ్లపై మృతకణాలు పేరుకొని ఉన్నప్పుడు చర్మం నిర్జీవంగా మారి పొడిగా కనపడుతుంది.
మృత కణాలను తొలగించటానికి కొన్ని ఇంటి చిట్కాలను పాటించాలి.
రాత్రి పడుకొనే ముందు కాళ్ళకు కొబ్బరి నూనె రాసి మసాజ్ చేయాలి.
మసాజ్ పూర్తి అయ్యాక కాళ్లకు సాక్స్ వేసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు కొన్ని రోజుల పాటు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక టబ్ లో గోరువెచ్చని నీటిని పోసి దానిలో కొన్ని చుక్కల ఆలివ్ ఆయిల్,కొంచెం బేకింగ్ సోడా, కొన్ని గులాబీ రేకులు వేయాలి.దీనిలో ఒక పావుగంట సమయం కాళ్ళను మరియు చేతులను ఉంచి తీసేయాలి.
ఈ విధానం చాలా తేలికైనది మరియు చవకైనది.
గోరువెచ్చని నీటిలో ఎప్సమ్ ఉప్పు వేసి కాళ్ళను, చేతులను పావుగంట సేపు ఉంచితే ఆ భాగాలకు రక్త ప్రసరణ బాగా జరుగుతుంది.
నిమ్మచెక్క మీద పంచదార జల్లి కాళ్ళు, చేతులకు రాసుకోవాలి.ఈ విధంగా ప్రతి రోజు చేస్తే చాలా తక్కువ సమయంలోనే మంచి ఫలితం కనపడుతుంది.