వైసీపీలో ఇంతకు మించిన దురదృష్టవంతుడు అయిన నేత ఎవ్వరూ ఉండరేమో అనుకోవాలి.ఆదివారం మృతిచెందిన విశాఖ వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్కు ఇది నూటికి నూరు శాతం వర్తిస్తుంది.
ఉత్తరాంధ్ర కాంగ్రెస్ రాజకీయాల్లో ద్రోణంరాజు తండ్రి ద్రోణంరాజు సత్యనారాయణ ఓ వెలుగు వెలిగారు.జుత్తాడ కరణంగా మంచి పేరున్న ఆయన విశాఖ నగర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి కాంగ్రెస్లో ఎన్నో పదవులు అధిరోహించారు.2004 ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసుడిగా వైఎస్ ప్రోత్సాహంతో ఆయన తనయుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఎంట్రీ ఇచ్చారు.
శ్రీనివాస్ ముందు నుంచి సౌమ్యుడు, వివాద రహితుడు అన్న పేరు తెచ్చుకున్నారు.తండ్రి మరణాంతరం జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆయన ఆ తర్వాత 2009లో జరిగిన సాధారణ ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి మరోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు.2014 ఎన్నికల్లో గెలవకపోయినా 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి సౌత్ నుంచి పోటీ చేశారు.జగన్ గాలిలో సైతం ఆయన స్వల్ప తేడాతో ఓడిపోయారు.అయితే జగన్ ఆయనపై నమ్మకం ఉంచి అత్యంత ప్రతిష్టాత్మకమైన వుడా చైర్మన్ చేశారు.కీలకమైన విశాఖ నగర రాజకీయాల్లో శ్రీనివాస్కు మరింత పెత్తనం అప్పగించాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు.
గత ఎన్నికల్లో శ్రీనివాస్ గెలిచి ఉంటే బ్రాహ్మణ కోటాలో మంత్రి కూడా అయ్యేవారు.
ఇక వచ్చే ఎన్నికల నాటికి తన వారసుడిని కూడా రంగంలోకి దించాలని చూస్తున్నారు.ఆయన వయస్సు కూడా 59 సంవత్సరాలే.ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన కరోనా కారణంగా మృతి చెందడం నిజంగా బాధాకరమైన విషయమే.ఇక ప్రముఖ సినీ రచయిత కోన వెంకట్కు శ్రీనివాస్ స్వయాన బావే.
కోన సోదరినే శ్రీనివాస్ పెళ్లాడారు.