బంగారం, వజ్రాలు, డ్రగ్స్, ఖరీదైన ఫోన్లు, మందులు ఇలా చాలా వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటే గనుక వాటికి తప్పనిసరిగా కస్టమ్స్ కట్టాల్సిందే.కానీ ఈ పన్ను నుంచి తప్పించుకోవడానికే కేటుగాళ్లు స్మగ్లింగ్ ముఠాలను ఆశ్రయిస్తూ వుంటారు.
ఇలాంటి వారి కోసం దేశంలో ఎన్నో స్మగ్లింగ్ గ్యాంగ్లు పనిచేస్తూ వుంటాయి.నిఘా సంస్థలు, పోలీసులు, కస్టమ్స్ అధికారులు ఎంతగా నిఘా పెడుతున్నప్పటికీ ఈ ముఠాలు ఏదో రకంగా దొడ్డిదారిన దేశంలో స్మగ్లింగ్ చేస్తూనే వున్నాయి.
తాజాగా రాయబారులు, దౌత్యవేత్తలు, హైకమీషన్ కార్యాలయాల్లో పనిచేసే వారికి వున్న చట్టపరమైన మినహాయింపులను వాడుకుంటూ ఓ పెద్ద కుట్రకు తెరలేపిందో ముఠా.దౌత్యవేత్తల పేరిట విదేశాల నుంచి కార్లను బుక్ చేసుకుని వాటికి పన్ను ఎగ్గొడుతున్నారు.
ఈ రాకెట్ను డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు చేధించారు.
వివరాల్లోకి వెళితే.
గురుగ్రామ్కు చెందిన ‘బిగ్బాయ్ టాయ్స్’ సంస్థ సీఈవో నిపున్ మిగ్లానీ, దుబాయ్కు చెందిన లిఖాయత్ బఛూ ఖాన్, బెంగళూరులోని ఫైనాన్షియర్ సూర్య అర్జున్లు దౌత్యవేత్తల పేర్లతో దిగుమతి చేసుకొని ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు.ఈ విధంగా రూ.25 కోట్ల మేరకు కస్టమ్స్ సుంకం ఎగ్గొట్టినట్లు తేల్చారు.ఆఫ్రికా ఖండంలోని ఒక దేశానికి చెందిన దౌత్యవేత్త పేరుతో ఈ కార్లను దిగుమతి చేసుకొన్నట్లు డీఆర్ఐ అధికారులు గుర్తించారు.
ఆ తర్వాత ఈ ముఠాను పట్టుకునేందుకు గాను ‘మాంటే కార్లో’ పేరుతో ఆపరేషన్కు శ్రీకారం చుట్టారు.దీనిలో భాగంగా దేశంలోని 7 నగరాల్లో విస్తృతంగా తనిఖీలు చేపట్టడంతో పాటు నిఘా పెట్టారు.
వీరు రేంజి రోవర్, ల్యాండ్ క్రూజర్ ప్రాడో వంటి లగ్జరీ కార్లను జపాన్, యుకే, యూఏఈ దేశాల్లో కొనుగోలు చేసి దౌత్యవేత్తల పేర్లతో భారత్కు దిగుమతి చేసుకొన్నట్లు గుర్తించారు.ఇవి ఇండియాకు డెలివరీ ఇవ్వగానే.
కొనుగోలు చేసిన ప్రైవేటు వ్యక్తి వద్దకు గానీ, లగ్జరీ కార్లు విక్రయించే డీలర్ వద్దకు గానీ చేరుతున్నట్లు నిర్థారించారు.మహారాష్ట్ర, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్లలోని కొందరు ఆర్టీవోలు ఈ కార్లకు రిజిస్ట్రేషన్ చేస్తున్నాయి.
ఈ క్రమంలో వీటిపై చెల్లించాల్సిన 204 శాతం కస్టమ్స్ డ్యూటీని దౌత్యవేత్తల పేరిట మినహాయింపు పొందుతున్నారు.
వీరి కుట్ర విషయం తెలుసుకున్న వెంటనే బిగ్బాయ్ టాయ్స్ సంస్థ. నిపున్ మిగ్లానీ సీఈవో బాధ్యతల నుంచి తొలగించింది.ఈ కేసులో దుబాయ్కు చెందిన మరో వ్యక్తి కూడా ఉన్నాడని.
అతన్ని కూడా పట్టుకుంటామని డీఆర్ఐ వెల్లడించింది.ఈ తరహా ఘటనలపై మరింత లోతుగా విచారణ చేస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.