భారత సంతతికి చెందిన ప్రముఖులు అమెరికాలో కీలక బాధ్యతలు చేపడుతున్న సంగతి తెలసిందే.సెనేటర్లు, కాంగ్రెస్ సభ్యులు, మేయర్లు, కౌన్సిల్ సభ్యులుగా రాణిస్తున్న భారతీయులు అమెరికాలోని అనేక రాష్ట్ర ప్రభుత్వాల్లో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో ఇండో అమెరికన్ అంటు వ్యాధుల నిపుణురాలు డాక్టర్ మనీషా జుథానీకి కీలక బాధ్యతలు అప్పగించారు కనెక్టికట్ గవర్నర్.ఆమెను రాష్ట్ర ప్రజారోగ్య శాఖ కమీషనర్గా నామినేట్ చేశారు.
కరోనా నేపథ్యంలో ఇప్పటి వరకు ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్న డాక్టర్ డీడ్రే గిఫోర్డ్ స్థానంలో మనీషా కమీషనర్గా పగ్గాలు అందుకుంటారు.తద్వారా ఈ పదవిని చేపట్టనున్న తొలి భారతీయ అమెరికన్గా మనీషా రికార్డుల్లోకెక్కనున్నారు. కరోనా వైరస్ను నియంత్రించడానికి రెస్టారెంట్లలో ఇండోర్ డైనింగ్ను నిషేధించాలని, జిమ్లను మూసివేయాలని, సామాజిక సమావేశాలపై నిషేధం విధించాలని గత ఏడాది నవంబర్లో ప్రభుత్వానికి లేఖ రాసిన వైద్యుల బృందంలో జుథాని కూడా వున్నారు.ఆమె సెప్టెంబర్ 20న కనెక్టికట్ ప్రజారోగ్య విభాగానికి కమీషనర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.ఆరోగ్యం సంరక్షణ, చికిత్స విషయంలో సమానత్వం పాటించడంపై కృషి చేస్తానని జుథాని తెలిపారు.2006లో యేల్ మెడికల్ స్కూల్లో ఫుల్ టైమ్ ఫ్యాకల్టీగా చేరిన మనీషా జుథానీ అనతికాలంలో తన ముద్ర వేశారు.2012లో అంటు వ్యాధులపై ఫెలోషిప్ ప్రోగ్రామ్ డైరెక్టర్గా ఆమె వ్యవహరించారు.
మరోవైపు కొద్దిరోజుల క్రితం ఇండియన్-అమెరికన్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సరళా విద్యా నాగాలాను ఇదే కనెక్టికట్ రాష్ట్రానికి ఫెడరల్ జడ్జిగా జో బైడెన్ ప్రతిపాదించిన సంగతి తెలిసిందే.ఆమె నియామకం ఖరారైతే… దక్షిణాసియాకు చెందిన తొలి ఫెడరల్ జడ్జి అవుతారు.సరళా ప్రస్తుతం కనెక్టికట్ జిల్లాలోని యుఎస్ అటార్నీ కార్యాలయంలో మేజర్ క్రైమ్స్ యూనిట్కు డిప్యూటీ చీఫ్గా వ్యవహరిస్తున్నారు.2017 నుండి ఆమె ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.2012లో యుఎస్ అటార్నీ కార్యాలయంలో చేరిన ఆమె… హేట్ క్రైమ్స్ కోఆర్డినేషన్ సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు.2008లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో బర్కిలీ స్కూల్ ఆఫ్లాలో జ్యూరిస్ డాక్టర్ డిగ్రీని పొందిన సరళ 2009లో జడ్జి సుషాన్ గ్రాబేర్ వద్ద క్లర్క్గా వ్యవహరించారు.