భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాలో 100 శాతం వాటాను కొనుగోలు చేయడానికి ప్రవాస భారతీయులకు అనుమతిస్తూ ఇటీవల కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసిన సంగతి తెలిసిందే.ప్రభుత్వ నిర్ణయానికి పరిశ్రమలు మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ (డీపీఐఐటీ) అనుమతించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానంలో అంతకుముందు ఎన్నారైలకే కేవలం ఎయిరిండియాలో 49 శాతం వాటా మాత్రమే అనుమతించే సంగతి తెలిసిందే.
విదేశీ విమానయాన సంస్థలతో పాటు విదేశీయులు మాత్రం ఎయిరిండియాలో ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ 49 శాతానికి మించి పెట్టుబడులు పెట్టడానికి వీల్లేదు.
అయితే ఎన్ఆర్ఐలు మాత్రం ఎయిరిండియాలో 100 శాతం పెట్టుబడులు పెట్టుకోవచ్చునని డీపీఐఐటీ శుక్రవారం ప్రకటనలో తెలిపింది.మార్చి 4న కేంద్ర కేబినెట్ నిర్ణయం ప్రకారం.ఎయిరిండియా ఇక ప్రభుత్వ యాజమాన్యం నుంచి పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోతుంది.అయితే ప్రపంచవ్యాప్తంగా వైమానిక పరిశ్రమలో అనుసరిస్తున్న (ఎస్ఓఈసీ) ఫ్రేమ్ వర్క్ కింద, ఒక నిర్ధిష్ట దేశం నుంచి విదేశాలకు ప్రయాణించే నేషనల్ క్యారియర్పై ఆ దేశ ప్రభుత్వం లేదా ఆ దేశ పౌరుల ఆధీనంలో ఉండాలని అంతర్జాతీయ నిబంధనలు చెబుతున్నాయి.
దీంతో అంతర్జాతీయ విమానయాన సంస్థలేవీ ఎయిరిండియాపై పెద్దగా ఆసక్తి చూపకపోవచ్చునని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఎయిరిండియాలో నూరు శాతం వాటా విక్రయానికి పలువురు దిగ్గజాలు ఆసక్తి వ్యక్తీకరణ చేస్తున్నారు.ప్రధానంగా టాటా గ్రూప్, హిందూజాలు, ఇండిగో, స్పైస్ జెట్ సహా కొన్ని ప్రైవేట్ ఈక్వీటీ సంస్థలు పోటీ పడవచ్చునని భావిస్తున్నారు.ప్రస్తుతం ఎయిరిండియా పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోవడంతో పాటు ఆర్ధిక మందగమనం వంటి ప్రతికూల పరిస్ధితులున్నా సంస్థకు విస్తృతంగా ఉన్న దేశీ, విదేశీ నెట్వర్క్, లండన్, దుబాయ్ వంటి కీలక విదేశీ విమానాశ్రయాల్లో ట్రాఫిక్ రైట్స్, స్లాట్లు, సాంకేతిక సిబ్బంది, పెద్ద సంఖ్యలో విమానాలు ఉండటంతో కొనుగోలుదారులు టేక్ ఓవర్కు ఆసక్తి కనబరుస్తున్నారు.