శరణార్ధుల తో ప్రయాణిస్తున్న బోటు ఒకటి మునిగిపోయిన ఘటన మధ్యధరా సముద్రంలో చోటు చేసుకుంది.యూరప్ చేరుకోవటం కోసం బోటులో ప్రయాణిస్తున్న శరణార్థులు ఒక్కసారిగా నీటమునిగినట్లు తెలుస్తుంది.
ట్యునీసియా సమీపంలో వీరి బోటు మునిగిపోయిందని 65 మంది ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ఒక ప్రకటనలో వెల్లడించింది.అయితే ఈ ప్రమాదం నుంచి కేవలం 16 మందిని కాపాడినట్లు చెప్పింది.
లిబియాలోని జువారా నుంచి గురువారం బయలు దేరిన బోటు మధ్యధరా సముద్రంలో మునిగిపోయినట్లు ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారు చెబుతున్న్నారు.బలమైన అలల కారణంగా వారు ప్రయాణించిన బోటు మునిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
అయితే లిబియా నుంచి యూరప్ వెళ్లే మధ్యధరాసముద్ర మార్గంలో 2019 మొదటి నాలుగు నెలల్లో 164 మంది చనిపోయినట్లు యూఎన్ హెచ్ సి ఆర్ లెక్కలు చెప్తున్నాయి.
తాజా ప్రమాదం ఈ ఏడాది శరణార్థులకు సంబంధించి అతి పెద్ద ప్రమాదంగా మారినట్లు తెలుస్తుంది.
ప్రమాదం నుంచి కాపాడిన వారిని ట్యునీసియా నౌకాదళం దేశ తీరానికి తీసుకువచ్చింది.నౌక నుంచి ట్యునీసియాలోకి అడుగుపెట్టేందుకు వీరు వేచివున్నారు.ప్రతి ఏటా వేలాది మంది శరణార్థులు యూరప్ చేరుకోవటం కోసం మధ్యధరా సముద్రాన్ని దాటటానికి ప్రయత్నిస్తున్నారు.ఆ ప్రాణాంతక ప్రయాణం ప్రారంభించటానికి లిబియా ఒక కీలక కేంద్రంగా మారింది.
ఈ ప్రయాణంలో పాతబడిపోయిన పడవల్లో, ప్రయాణికులను పెద్ద సంఖ్యలో ఇరికించి పంపిస్తున్నారు.ఫలితంగా చాలా మంది చనిపోతున్న ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి
.