ఎలాంటి నష్ట భయం లేకుండా సురక్షితమైన పెట్టుబడి మార్గాలు అందించడంలో పోస్టాఫీస్ పథకాలు ముందుంటాయి.ఆ పథకాల్లో ప్రధానంగా “కిసాన్ వికాస్ పత్ర” పథకం పెట్టుబడిదారులను బాగా ఆకట్టుకుంటోంది.
కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ (Kisan Vikas Patra)లో పెట్టుబడి పెట్టడం ద్వారా రెట్టింపు డబ్బును పొందొచ్చు.ఈ స్కీమ్లో పెట్టిన పెట్టుబడి 124 నెలలు లేదా పదేళ్లలో రెట్టింపు అవుతుంది.ప్రభుత్వం మద్దతు కలిగిన ఈ పథకం ప్రస్తుతం పెట్టుబడిదారుల పెట్టుబడిపై 6.4 శాతం వడ్డీని అందిస్తోంది.కిసాన్ వికాస్ పత్ర పథకంలో మీరు కనీసం రూ.1000తో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు.గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఈ పథకంలో ఖాతా ఓపెన్ చేయవచ్చు.పిల్లల తరఫున తల్లిదండ్రులు అకౌంట్ తెరవచ్చు.ఇద్దరు లేదా ముగ్గురు పెద్దలు కలిసి ఒక ఉమ్మడి ఖాతాను ఓపెన్ చేయవచ్చు.
ఖాతా ఓపెన్ చేసేటప్పుడు దరఖాస్తు ఫారంతో పాటు ఆధార్, పాన్, ఓటర్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్ పోర్ట్ లో ఏదైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్ అందించాల్సి ఉంటుంది.రూ.50,000 కంటే ఎక్కువ పెట్టుబడులకు తప్పనిసరిగా పాన్ కార్డ్ సబ్ మిట్ చేయాలి.రూ.10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడులకు ఇన్ కమ్ సోర్స్ ప్రూఫ్ సమర్పించాలి.అకౌంట్ ఓపెన్ చేసిన రెండేళ్ల తర్వాత షరతులకు అనుగుణంగా ముందస్తుగానే విత్డ్రా చేసుకోవచ్చు.
వడ్డీరేటును కేంద్రం ప్రతి మూడు నెలలకోసారి సవరిస్తుంది.మీరు అకౌంట్ ఓపెన్ చేసే సమయంలో ఏ వడ్డీ రేట్ అయితే అమలులో ఉందో అదే రేటు కాలపరిమితి మొత్తానికి వర్తిస్తుందని గమనించాలి.ఏ రిస్క్ లేకుండా చక్కటి రాబడి సొంతం చేసుకోవాలని ఆలోచిస్తున్న పెట్టుబడిదారులకు పోస్టాఫీసు కిసాన్ వికాస్ పత్ర పథకం ఉత్తమ ఎంపిక అని ఆర్థిక నిపుణులు సైతం చెబుతున్నారు.అందుకే జీరో రిస్కుతో పెట్టుబడి పెట్టాలనుకునే వారు ఈ ఖాతాని నిర్భయంగా సెలెక్ట్ చేసుకోవచ్చు.