ఇప్పుడు తెలంగాణలో ఉప ఎన్నికల సందడి కనిపిస్తోంది.మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం, వాటిని స్పీకర్ ఆమోదించడంతో మునుగోడు లో ఉప ఎన్నికలు రావడం ఖాయంగా తేలిపోయింది.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరకు వచ్చేస్తుండడంతో, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకంగానే మారింది.ఇక్కడ గెలుపు ఆధారంగానే రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే లెక్క జనాలు వేసుకుంటారు కాబట్టి, ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలు గట్టిగానే ప్రయత్నాలు మొదలుపెట్టాయి.
అధికార పార్టీ టిఆర్ఎస్ కు ఇక్కడ అవకాశం లేకుండా చేసేందుకు బిజెపి పగడ్బందీగానే వ్యూహాలు రచిస్తోంది.
ప్రతి పల్లెను ప్రతి గడపను సందర్శించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
గడప గడపకు బిజెపి శ్రేణులు వెళ్లే విధంగా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఏ ఏ పథకాలను అమలు చేసింది ? వాటి ద్వారా ఎంతవరకు లబ్ధి చేకూరింది ? ఎవరెవరికి ఏ మేలు జరిగింది ఇలా అన్ని వివరాలను జనాల్లోకి తీసుకువెళ్లి వారికి బిజెపిపై ఆశక్తి పెరిగేలా చేయాలనే ఆలోచనలో బిజెపి నేతలు ఉన్నారట.కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దుర్వినియోగం చేస్తోంది ? పేర్లు మార్చి తమ పథకాలుగా ఎలా చెప్పుకుంటుంది అనే విషయాన్ని జనాలకు అర్థమయ్యేలా చెప్పాలని, కేంద్ర ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేస్తున్న టిఆర్ఎస్ కు ఏ విధంగా చెక్ పెట్టాలనే విషయంపై బిజెపి నేతలు దృష్టి పెట్టారు.
మండలాలు గ్రామాల వారిగా ఇన్చార్జిలను నియమించాలని బిజెపి భావిస్తోంది.అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వివరాలను పాంప్లెట్ రూపంలో ముద్రించి జనాలకు అందించాలని నిర్ణయించుకుంది.ఈ విధంగా మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గడప కు బిజెపిని తీసుకువెళ్లి ఆదరణ పెంచే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.మునుగోడు నియోజకవర్గంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సుపరిచితుడు కావడం, ప్రజలతోనూ సన్నిహిత సంబంధాలు ఉండడం వంటివి తమకు కలిసి వస్తాయని బిజెపి లెక్కలు వేసుకుంటుంది.
అలాగే టిఆర్ఎస్ ప్రభుత్వంపై జనాల్లో పెరిగిన వ్యతిరేకత తమకు అనుకూలంగా మారుతుందని, అదే తమకు వివిజయావకాశాలను తెచ్చిపెడుతుంది అనే లెక్కల్లో కమలనాధులు ఉన్నారట.