అన్ని దానాల కన్నా అన్నదానం మిన్న అని అంటారు.మనం బ్రతికి ఉన్నంతకాలం ఇదే నిజం.
శరీరానికి అవసరమైనంత ఆహారం మాత్రమే తీసుకుంటారు ఎవరైనా.మరి చనిపోయాక?
అన్ని దానాల కన్నా అవయవదానం మిన్న .అవును, మనం చనిపోతుండగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే.మనలో చాలామందికి తెలియని షాకింగ్ నిజం ఏంటంటే, ప్రతీ ఏటా, సమయానికి అవయవాలు దొరకక కనీసం 5 లక్షలమంది చనిపోతున్నారట.ఇది కేవలం అంచనా మాత్రమే.వాస్తవికంగా ఈ లెక్కలు అంతకుమించి ఉంటాయి.
ఎన్డిటీవి నిర్వహించిన ఒక సదస్యులో వక్తలు అవయవదానం చేయాల్సిన అవసరాన్ని మరోసారి గుర్తుచేసారు.బాధకరమైన విషయం ఏమిటంటే, మన దేశ జనాభాలో కనీసం 1% జనాలు కూడా అవయవదానం చేయట్లేదట.ఇక మీరే అర్థం చేసుకోండి, హాస్పిటల్స్ లో ఎంతమంది అవసరంలో ఉంటారో, వారిలో ఎంతమందికి సమయానికి కావాల్సిన అవయవం దొరుకుతుందో.
“అవయవదానం మీద చాలామందిలో ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి.వారికి సమాచారాన్ని, జ్ఞానాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఎందుకో తెలియదు, రక్తదానానికి ముందుకి వచ్చినట్లు మన ప్రజలు అవయవదానానికి ముందుకి రాలేకపోతున్నారు.ఈ సమస్యలో ఉన్న అతిపెద్ద ఛాలెంజ్ ఏంటంటే, చనిపోగానే మీ శరీరంలోని అవయవాలు, కొనఊపిరితో ఉన్న మరో పేషెంట్ కి పనికివస్తాయని, అర్థమయ్యేలా ప్రజలకి చెప్పగలగటం” అంటూ ప్రొఫెసర్ ఆర్తి విజ్ అన్నారు.
అయినా చాదస్తం కాకపోతే, చనిపోయాక మన శరీరం కొన్నిరోజులకే కుళ్ళిపోతుంది.
అలా నిరుపయోగంగా చనిపోయే బదులు, మన అవయవాలతో మరొకరి ప్రాణాల్ని కాపాడితే తప్పేముంది.మనం ప్రాణంతో ఉండగానే ఎవరు అవయవాల్ని ఎత్తుకెళ్ళట్లేదు కదా.ప్రాణం వదిలాకే కదా, మన శరీర భాగాలని మరికరికి అమర్చేది.ఇప్పటికే ఆమీర్ ఖాన్, నాగార్జున లాంటివారు తమ అవయవాల్ని దానం చేసారు.
ఇలాంటి సెలబ్రిటీలు ఇంకొంతమంది ముందుకి వచ్చి అవయవదానం చేస్తే ప్రజల్లో ఏదైనా మార్పు వస్తుందేమో.