అమెరికాలో నవంబర్ 3 న జరగనున్న అధ్యక్ష ఎన్నికల నేపధ్యంలో ప్రచారాలు ఊపందుకున్నాయి.ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ, పలు వాగ్దానాలు చేస్తూ ఓటర్లని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అధికారాన్ని సాధించాలని డెమోక్రటిక్ పార్టీ, అధికారం చేజార్చుకోకుండా కాపాడుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఇవ్వని వాగ్దానాలు లేవు, చేయని ప్రయత్నాలు లేవు.ఇదిలాఉంటే కరోనా నేపధ్యంలో పార్టీల నేతలు అందరూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రజల ఆరోగ్యాని దృష్టిలో పెట్టుకుని బహిరంగ సమావేశాలను నిర్వహిస్తున్నారు.అయితే
ట్రంప్ మాత్రం ఎప్పటిలానే తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా మళ్ళీ మాస్క్ ధరించకుండా బహిరంగ సమావేశాలు నిరహిస్తున్నారు.ఇప్పటికే కరోనా అమెరికాలో ఎంట్రీ ఇవ్వడానికి, లక్షలాది మంది అమెరికన్స్ కరోనాతో చనిపోవడానికి ప్రధాన కారణం ట్రంప్ అని ఫిక్స్ అయిపోయిన నేపధ్యంలో కూడా ట్రంప్ తాజాగా చేపట్టిన బహిరంగ సభా వేదిక కనీస జాగ్రత్తలు తీసుకోకుండా జరిగిందని మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
వేలాది మంది పాల్గొన్న ఈ సభలో దాదాపు ట్రంప్ మద్దతు దారులు, ట్రంప్ సైతం మాస్క్ ధరించకుండా కనపడటం ట్రంప్ బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని డెమోక్రాట్లు విమర్శలు చేస్తున్నారు.మాస్కులు లేకుండా కనీసం భౌతిక దూరం పాటించకుండా ఒకరిపై ఒకరు తోసుకుంటూ కిక్కిరిసిన జనం ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ట్రంప్ ఇంకెంత మంది ప్రాణాలు బలి తీసుకుంటాడంటూ తమ రాజకీయ ప్రచారానికి ఈ ఘటనను వాడేసుకుంటున్నారు.గతంలో కూడా ట్రంప్ మాస్క్ లు ధరించడం తప్పనిసరి కాదని, నేను అలా అమెరికన్స్ కి చెప్పానని ఎవరి ఇష్టం వారిదని చెప్పడంతో పెద్ద ఎత్తున విమర్శలు రేగాయి.
దాంతో ఒక మెట్టు దిగిన ట్రంప్ మాస్క్ ధరించి అందరూ మాస్క్ ధరించడం శ్రేయస్కరమని పిలుపునిచ్చారు.కానీ తాజాగా జరిగిన ఘటనతో ట్రంప్ పై మరోసారి విమర్శలు వెల్లువెత్తున్నాయి.