అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సతీమణి, దేశ ప్రథమ మహిళ జిల్ బైడెన్కు చేదు అనుభవం ఎదురైంది.వ్యాక్సినేషన్కు సంబంధించి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్ధతుదారుల నుంచి ఆమె నిరసనను ఎదుర్కొన్నారు.
వివరాల్లోకి వెళితే.అమెరికాను కరోనా నుంచి రక్షించడానికి జో బైడెన్ తీవ్రంగా శ్రమిస్తున్నారు.ఇందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే పరిష్కారమన్న ఆయన.ప్రజలంతా టీకాలు వేయించుకోవాలని కోరుతున్నారు.అయినప్పటికీ జనం వ్యాక్సిన్ తీసుకోవడానికి జంకుతున్నారు.సోషల్ మీడియాలో వ్యాక్సిన్ గురించి తప్పుడు సమాచారం వ్యాప్తి జరుగుతుండటం వల్లే ఈ పరిస్ధితి ఎదురవుతోంది.ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడు సామాజిక మాధ్యమాలపపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.దేశాన్ని కరోనా ఫ్రీ చేయాలని తీవ్రంగా శ్రమిస్తున్న ఆయన ప్రయత్నాలకు సోషల్ మీడియా తీవ్ర అవరోధంగా మారింది.
సామాజిక మాధ్యమాలు అన్యాయంగా ప్రజలను చంపేస్తున్నాయని బైడెన్ ఇటీవల వ్యాఖ్యానించారు.ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
అంతేగాక వ్యాక్సిన్ వేసుకోనివారిలోనే వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటోందని గుర్తు చేశారు.కనుక సాధ్యమైనంత త్వరగా టీకాలు తీసుకోవడం మంచిదని బైడెన్ దేశ ప్రజలకు సూచించారు.
ఈ క్రమంలో ప్రజలను వ్యాక్సిన్ వేయించుకునేలా చైతన్య పరిచేందుకు గాను జిల్ బైడెన్ రంగంలోకి దిగారు.దీనిలో భాగంగా ఆదివారం టోక్యో ఒలింపిక్స్ నుంచి తిరిగి అమెరికాకు వస్తూ హవాయిలోని బివిన్ వైపాహు హైస్కూల్ను ఆమె సందర్శించారు.ఈ నేపథ్యంలో ట్రంప్ మద్ధతుదారులు, టీకా వ్యతిరేకులు పాఠశాల వద్ద గుమిగూడారు.నిరసనకారులు ‘‘ఆల్ లైవ్ మేటర్స్ ’’, ట్రంప్ గెలిచారు వంటి పదాలతో కూడిన టీ షర్ట్లను ధరించారు.
వీరితో పాటు క్యూబా నిరసనకారులకు మద్ధతుగా వున్న పలువురు ప్రదర్శనకారులు కూడా వున్నారు.
స్వతహాగా లెక్చరర్ అయిన జిల్ బైడెన్.బయట వ్యతిరేకత వున్నప్పటికి స్కూల్లో ఎక్కువసేపు గడిపారు.ఈ సందర్భంగా స్కూల్ మెడికల్ అసిస్టెంట్ శిక్షణా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న ఓ ఫిలిప్పీన్ జాతీయుడిని జిల్ బైడెన్ కలుసుకున్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.డెమొక్రాటిక్ పార్టీకి చెందిన హవాయి గవర్నర్ డేవిడ్ ఇగేను ప్రశంసించారు.కోవిడ్ నుంచి హవాయి ప్రజలను రక్షించడానికి గవర్నర్ తీవ్రంగా శ్రమిస్తున్నారని తెలిపారు.కాగా, అమెరికాలో కోవిడ్ 19 ప్రత్యేకించి డెల్టా వేరియంట్ కేసులు పెరుగుతుండటంతో .వ్యాక్సిన్ తీసుకోని ప్రాంతాల్లో ఆమె పర్యటన నిర్వహించడం విశేషం.గత వీకెండ్లో ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు ఆమె టోక్యో వెళ్లారు.
అక్కడి యూఎస్ రాయబార కార్యాలయం నుంచి ఆమె జూమ్ కాల్ ద్వారా అమెరికా అథ్లెట్లతో ముచ్చటించారు.