భారత్ లో గడిచిన ఆరున్నర నెలలుగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.దేశంలో ప్రతిరోజూ 70 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి.
చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా మహమ్మారి ఆ దేశంలో అదుపులోకి వచ్చినా అమెరికా, బ్రెజిల్, భారత్ లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.ఇప్పట్లో వైరస్ అదుపులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
చలికాలం వస్తే వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్తల్లో నిలిచారు.
ప్రపంచ దేశాల ప్రజలు వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న తరుణంలో ట్రంప్ ఒక మీడియా సంస్థతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి వ్యాక్సిన్ అవసరం లేకుండానే పోతుందని చెప్పారు.మనుషుల్లో హెర్డ్ మెంటాలిటీ వల్ల కరోనా మహమ్మారి దానంతట అదే పోతుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
సాధారణంగా వైద్యులు, శాస్త్రవేత్తలు ప్రజల్లో హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా వైరస్ ను జయించడం సాధ్యమవుతుందని పలు సందర్భాల్లో చెప్పారు.అయితే ట్రంప్ మాత్రం హెర్డ్ ఇమ్యూనిటీకి బదులుగా హెర్డ్ మెంటాలిటీ అనే పదాన్ని వాడారు.
ట్రంప్ ఈ పదాన్ని వాడటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.ఒకవైపు కరోనాకు వ్యాక్సిన్ అవసరం లేదని చెప్పిన ట్రంప్ మరోవైపు మూడు నాలుగు వారాల్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుందని ప్రకటించారు.
ట్రంప్ అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకుంటున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఎన్నికలకు ముందే వ్యాక్సిన్ ను విడుదల చేసి వ్యాక్సిన్ ను ప్రచార అస్త్రంగా వాడుకోవాలని ట్రంప్ భావిస్తున్నారు.
అయితే నవంబర్ 3వ తేదీలోపు వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందో లేక ఆలస్యమవుతుందో చూడాల్సి ఉంది.