అమెరికాలో ఎన్నికల వేడి మళ్ళీ మొదలయ్యింది.నిన్న మొన్నటి వరకూ రాజకీయాలని పక్కన పెట్టి కరోనాపై పోరు చేశారు.
కానీ ఇప్పుడు మళ్ళీ సీన్ రిపీట్ అయ్యింది.ట్రంప్ పై డెమోక్రటిక్ పార్టీ విమర్శలు ఎక్కు పెడుతోంది.
ఎన్నడూ లేనంతగా ట్రంప్ పై చేస్తున్న విమర్శలు పరిశీలకులని సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి.అమెరికాకి ఈ దుస్థితి రావడానికి ప్రధాన కారణం ట్రంప్ అంటూ మండిపడిన ప్రతినిధుల స్పీకర్, డెమోక్రటిక్ పార్టీ సీనియర్ నేత నాన్సీ ఫెలోసీ మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ చేతకాని తనం వలనే ఎంతో మంది అమెరికా ప్రజలు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు.ట్రంప్ అసమర్ధుడు కాబట్టే అమెరికా ఆర్ధిక వ్యవస్థ కుప్ప కూలిందని ఘాటుగా విమర్శలు చేశారు.
ఇప్పుడు అమెరికా ప్రజలు అందరూ ఏకం అవ్వాల్సిన సమయం వచ్చింది.కరోనాని ఓడించడానికి అందరం కలిసి కట్టుగా పోరాటం చేద్దాం.
అలాగే ట్రంప్ ని ఓడించడానికి కూడా మనం సిద్దంగా ఉండాలని అన్నారు.
అమెరికా ప్రజల ప్రాణాలు బలిగొన్న ఈ వైరస్ చైనా నుంచీ వస్తుందని ముందే తెలిసినా ట్రంప్ ముందస్తు చర్యలు తీసుకోకపోవడంలో విఫలం అయ్యారని , ఇప్పటికి మనం మేల్కొనక పొతే భవిష్యత్తు తరాలకి గొప్పదైన అమెరికాని అగ్ర రాజ్యంగా ఉన్న అమెరికాని చూపించలేని వాళ్ళం అవుతామని పిలుపునిచ్చారు.భావితరాలు గొప్పగా ఉండాలంటే కరోనాపై పోరు చేస్తున్నట్టుగా ట్రంప్ పై కూడా పోరు చేయాలని ప్రకటించారు.