అధ్యక్ష ఎన్నికల్లో విజయం తనదేనని చివరి వరకు ఎంతో ధీమాగా కనిపించిన డొనాల్డ్ ట్రంప్కు అమెరికన్లు షాకిచ్చిన సంగతి తెలిసిందే.కానీ ఆయన అంచనాలు తారుమారై జో బైడెన్ ఘన విజయం సాధించారు.
దీంతో ఎన్నికల్లో, కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వచ్చారు.అక్కడితో ఆగకుండా కోర్టుల్లో సైతం పిటిషన్లు దాఖలు చేయించారు.
న్యాయస్థానాల్లో చుక్కెదురు కావడంతో ట్రంప్ మౌనం దాల్చారు.అటు అధికార బదిలీకి, వైట్ హౌస్ ఖాళీ చేయించేందుకు ఇష్టపడకపోవడంతో ఆయన వైఖరి వివాదాస్పదం అవుతోంది.
రెండు రోజుల క్రితం ఓటమిని అంగీకరించిన ట్రంప్.సోమవారం నేనే గెలిచాను అంటూ ట్వీట్ చేశారు.
అయితే ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న ఆయన విపరీత ఆలోచనలు చేస్తున్నారు.ఇప్పటికే రక్షణ శాఖ మంత్రి మార్క్ ఎస్పర్ను తొలగించిన ఆయన తాజాగా ఓ ఎన్నికల అధికారిపై వేటు వేశారు.
అధ్యక్ష ఎన్నికలు నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) డైరెక్టర్ క్రిస్టోఫర్ క్రెబ్స్ను తక్షణమే పదవి నుంచి తొలగిస్తున్నట్లు ట్రంప్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు.
ఎన్నికల ప్రక్రియపై అసత్య వ్యాఖ్యలు చేసినందుకే ఆయనను తొలగిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.అధ్యక్ష ఎన్నికల్లో చాలా అవకతవకలు, మోసాలు జరిగాయి, చనిపోయినవారి ఓట్లు పడ్డాయి, ఓటింగ్ మెషిన్లలో సమస్యలు తలెత్తాయని ట్రంప్ ఆరోపించారు.ఇందువల్ల ట్రంప్కు పడాల్సిన ఓట్లన్నీ జో బైడెన్కు పడ్డాయి.
చాలా చోట్ల ఓటింగ్ రోజుల తరబడి జరిగింది, ఇలాంటివి చాలా ఉన్నాయి అందుకే క్రిస్ క్రెబ్స్ను సీఐఎస్ఏ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తున్నా అని అధ్యక్షుడు తెలిపారు.అలాగే 2020 అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ శక్తులు జోక్యం చేసుకోలేదని, అది తన పాలనా యంత్రాంగం వల్లే సాధ్యమైందని ట్రంప్ స్పష్టం చేశారు.
మరోవైపు రెండు నెలలు మాత్రమే పదవిలో కొనసాగే వీలుండటంతో ఉన్న కాస్త సమయంలో ఏవేవో చేసేసి తన ప్రత్యర్ధి బైడెన్ను ఇరికించాలని ట్రంప్ ప్లాన్లు వేస్తున్నారు.ఇప్పటికే బైడెన్కు, చైనాకు మధ్య వివాదాన్ని రాజేయడానికి ప్రయత్నించినట్లుగా వార్తలు వచ్చాయి.
తాజాగా అమెరికా చిరకాల ప్రత్యర్ధి ఇరాన్పై దాడి చేయాలని ట్రంప్ భావించినట్లుగా తెలుస్తోంది.ఇరాన్లోని ప్రధాన అణుస్థావరంపై దాడి చేయడానికి ఉన్న మార్గాలను సూచించాలని ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ట్రంప్ అధికారుల్ని కోరినట్లు సమాచారం.
అయితే ఇప్పుడున్న పరిస్ధితుల్లో ఈ చర్య మంచిది కాదని అధికారులు.ట్రంప్ను వారించినట్లుగా న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే.