అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శకం ముగిసింది.ఈ నాలుగేళ్లలో ఎన్నో వివాదాలు, మరెన్నో సంచలన నిర్ణయాలు, మధ్యలో తీపి జ్ఞాపకాలు ఇలా దేశ చరిత్రలో విభిన్నమైన పాలన అందించిన అధ్యక్షుడిగా ట్రంప్ చరిత్రలో నిలిచిపోయారు.
మరికొద్దిగంటల్లో కొత్త అధ్యక్షుడిగా జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ నేపథ్యంలో ట్రంప్ వైట్హౌస్లో ఇన్నాళ్లు తనకు సహకరించిన వారికి, సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.
నాలుగేళ్ల కిందట దేశాన్ని పునర్నించేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశామని.కొత్త ఉత్సాహం, ఉత్తేజంతో పౌరులకు ప్రభుత్వాన్ని చేరువ చేయాలనే ఉద్దేశంతో పని చేశామని ట్రంప్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడిగా పని చేయడాన్ని తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని… ఈ అవకాశం ఇచ్చిన అమెరికన్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.కొత్తగా అధికార బాధ్యతలు చేపడుతున్న యంత్రాంగం అమెరికాను సురక్షితంగా ఉంచడంలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నానని తన వీడ్కోలు సమావేశంలో ట్రంప్ చెప్పారు.
అధ్యక్ష ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై ట్రంప్ విచారం వ్యక్తం చేశారు.ఇదే సమావేశంలో తన హయాంలో తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావించారు.చైనాతో వైఖరి, తనపై సోషల్ మీడియా నిషేధం తదితర అంశాలపై మాట్లాడారు.మధ్యప్రాచ్యంలో అనేక శాంతి ఒప్పందాలు కుదిర్చేందుకు కృషి చేశానని, చైనాకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టడంలో విజయం సాధించానని ట్రంప్ గుర్తుచేశారు.
అలాగే తన హయాంలో యుద్ధం అన్న మాట లేదని వెల్లడించారు.ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా ఉన్న అమెరికాకు బయటి శక్తుల నుంచి ముప్పు పొంచి వుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
అయితే సమావేశంలో ఎక్కడ కూడా జో బైడెన్ పేరు ఉచ్చరించకపోవడం గమనార్హం.