జో బైడెన్ ఎన్నికను ధ్రువీకరించేందుకు అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశమైన నాడు క్యాపిటల్ బిల్డింగ్పై జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు.46వ అధ్యక్షుడిగా బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే జనవరి 20వ తేదీన ఆందోళనకారులు మరింత రెచ్చిపోయే అవకాశముందని ఇంటెలిజెన్స్ నివేదిక సమర్పించింది.దీంతో దేశంలో ఎలాంటి హింసకు తావు లేకుండా అత్యవసర పరిస్ధితిని విధించాలని వాషింగ్టన్ మేయర్ మురియెల్ బౌసర్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు.దీనిపై స్పందించిన ట్రంప్ రాజధాని వాషింగ్టన్ డి.సి ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించారు. క్యాపిటల్ బిల్డింగ్పై ట్రంప్ మద్ధతుదారులు దాడి చేసిన తర్వాత దేశంలో పరిస్ధితి నివురుగప్పిన నిప్పులా వుంది.
ఈ నేపథ్యంలో రాజధానిలోని క్యాపిటల్ భవనంతో పాటు అన్ని రాష్ట్రాల రాజధానుల్లోని క్యాపిటళ్లపై దాడికి కుట్ర జరుగుతోందని అమెరికా అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్బీఐ హెచ్చరించింది.బైడెన్ ప్రమాణ స్వీకారానికి సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఘర్షణలు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని ఎఫ్బీఐ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా అత్యవసర పరిస్థితిని విధించారు.
మరోవైపు అత్యవసర పరిస్థితి నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా హోంలాండ్ సెక్యూరిటీ విభాగంతో పాటు ఫెడరల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ (ఎఫ్ఈఎంఏ)లు సేవలు అందించనున్నాయి.అలాగే స్టాఫర్డ్ చట్టం ప్రకారం.ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రజల ప్రాణాలకు ముప్పు వంటి ఘటనలు తలెత్తిన పక్షంలో వాటిని నిలువరించేందుకు కేంద్ర బలగాలకు ప్రత్యేక అధికారాలు వస్తాయి.
మరోవైపు జనవరి 20న నూతన అధ్యక్షుడిగా బైడెన్ క్యాపిటల్ బిల్డింగ్లోనే ప్రమాణ స్వీకారం చేయనున్నారు.మాజీ అధ్యక్షులు జార్జ్ బుష్, బిల్ క్లింటన్ సహా పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
జనవరి 6న క్యాపిటల్ భవనంలో జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని అక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.