అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేక డొనాల్డ్ ట్రంప్ చేసిన విన్యాసాలు అత్యంత వివాదాస్పదమైన సంగతి తెలిసిందే.బైడెన్ మోసం చేసి గెలిచారని.
నైతిక విజయం తనదేనంటూ వాదించారు.అక్కడితో ఆగకుండా కోర్టుల్లో దావాలు వేసి చీవాట్లు తిన్నారు.
ఈ వ్యవహారంలోనే ట్రంప్ మరో వివాదంలో చిక్కుకున్నారు.అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన ట్రంప్.
ఎన్నికల బ్యాలెట్ బాక్సులను సీజ్ చేయాలని రక్షణశాఖను ఆదేశించారట.దానికి సంబంధించిన డ్రాఫ్ట్ ఆర్డర్ను నేషనల్ ఆర్కైవ్స్ సీజ్ చేసింది.
డిసెంబర్ 16, 2020 రోజున అధ్యక్షుడి నుంచి ఆ ఆదేశాలు జారీ అయినట్లు వెల్లడైంది.ఓటింగ్ మెషీన్లను సీజ్ చేసేందుకు ప్రత్యేక కౌన్సిల్ను ఏర్పాటు చేయాలని ఆ లేఖలో పేర్కొన్నారు.
కానీ ఆ డ్రాఫ్ట్ ఆర్డర్పై మాత్రం ట్రంప్ సంతకం లేనట్లుగా తెలుస్తోంది.
జనవరి 6 నాటి ఘటనకు సంబంధించి 9 మంది సభ్యులున్న ప్రతినిధుల సభ కమిటీ చేపట్టిన విచారణకు వ్యతిరేకంగా ట్రంప్ పోరాడుతున్న సంగతి తెలిసిందే.
దీనిలో ఆయన వ్యక్తిగత చర్యలు, ట్రంప్ సహాయకులు, రాజకీయ సలహాదారుల పాత్ర వుందని అమెరికా వ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలోనే ట్రంప్ న్యాయవాదులు చేస్తున్న విజ్ఞప్తిని కోర్టులు తిరస్కరిస్తున్నాయి.
ఇప్పటికే యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్, యూఎస్ ఫెడరల్ అప్పీల్స్ కోర్ట్ను ఆశ్రయించగా.అన్ని చోట్లా నిరాశే ఎదురవుతోంది.
ఆ దాడి గురించి విచారణ జరుగుతున్న నేపథ్యంలో.హౌజ్ కమిటీకి వచ్చిన 750 లేఖల్లో ఓటింగ్ మెషీన్లను సీజ్ చేయాలన్న లేఖ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఎన్నికల బ్యాలెట్ల సీజ్ గురించి రక్షణశాఖ మంత్రికి ట్రంప్ లేఖ రాశారు.ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన మెషీన్లు, ఎక్విప్మెంట్, ఎలక్ట్రానిక్ డేటా, రికార్డులన్నింటినీ భద్రపరచాలని ట్రంప్ తన మూడు పేజీల డ్రాఫ్ట్ ఆర్డర్లో ఆదేశించారు.
మరి ఈ వ్యవహారంపై మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్లు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.