అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కి ట్విట్టర్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది.అమెరికా కాపిటల్ మీద జరిగిన దాడి నేపధ్యంలో ట్రంప్ చేసిన ట్వీట్స్ హింసను ప్రేరేపించే విధంగా ఉన్నాయని భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని గ్రహించిన ట్విట్టర్ ముందస్తుగానే ఈ చర్యలు తీసుకున్నట్టుగా ప్రకటించింది.
వివరాలోకి వెళ్తే.
అమెరికా కాపిటల్ లో అమెరికా కాంగ్రెస్ సమావేశమైన విషయం అందరికి తెలిసిందే.
ఈ వేదిక ద్వారా అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకుంటారు.అయితే ఈ సమావేశానికి భంగం కలిగించాలని భావించిన ట్రంప్ ఆయన మద్దతు దారులను నిరసనకు ప్రేరేపించడంతో అక్కడికి భారీగా తరలివచ్చిన నిరసన కారులు చరిత్రలో ఎన్నడూ జరగని విధంగా అమెరికా కాపిటల్ లోకి ప్రవేశించారు.
దాంతో కాపిటల్ లో ఘర్షణ వాతావరణం నెలకొంది.వారిని నిలువరించడానికి కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి.
ఈ క్రమంలో పోలీసులకు, ఆందోళన కారులకు మధ్య జరిగిన దాడులలో ఓ పోలీసు అధికారితో పాటు, నలుగురు ఆందోళన కారులు మృతి చెందారు.ఈ నేపధ్యంలో
అమెరికా నేషనల్ మాల్ ముందు ఆందోళన కారులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారు.
ఆందోళన కారులు వెనక్కి వెళ్ళండి అంటూ చెప్తూనే మనకు ఈ ఎన్నికల్లో తీరని అన్యాయం జరిగిందని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.అంతేకాదు అమెరికా కాపిటల్ లో జరిగిన దాడి వీడియోని తన ఖాతాలో పోస్ట్ చేసి మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నాను అంటూ మరింతగా రెచ్చగొట్టారు.
ఈ తతంగం మొత్తం ట్విట్టర్ , ఫేస్ బుక్ , యూట్యూబ్ వేదికగా జరగడంతో ట్రంప్ పై 12 గంటల పాటు నిషేధం విధించాయి.హింసని ప్రేరేపించే పోస్ట్ లు తొలగించాలని తెలిపాయి.
అయితే ఎప్పటికైనా ట్రంప్ తో ప్రమాదమని భావించిన ట్విట్టర్ మాత్రం ట్రంప్ పై శాశ్వత నిషేధాన్ని విధించింది.