ట్రంప్ అక్రమ వలసదారులపై ఉక్కు పాదం మోపుతానని ప్రకటించారు.ఈ నెల 4 వ తేదీ నుంచీ తమ దేశంలో ఉన్న అక్రమ వలస దారులపై దాడులు మొదలు పెడుతామని ప్రకటించారు.
మీడియాతో మాట్లాడిన ట్రంప్ చట్ట విరుద్దంగా అమెరికాలో ఉండే వారికి ఇకపై ఉండే అవకాశం ఎట్టి పరిస్థితుల్లో ఉండబోదని తెలిపారు.వారిని వెనక్కి పంపే కార్యక్రమం చేపదుతున్నామని అన్నారు.
సెంట్రల్ అమెరికా నుంచీ వచ్చే అక్రమ వలస దారులని వెనక్కి పంపేందుకు సరిహద్దుల నిర్వహణ అవసరాలకి గాను సుమారు 460 కోట్ల డాలర్ల నిధుల కేటాయింపు బిల్లుని ఆయన ఆమోదించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్రమ వలసల సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు రిపబ్లికన్ ,డెమోక్రటిక్ పార్టీ నేతలు కృషి చేస్తారన్న ఉద్దేశంతో తాము రెండు వారాలు వాయిదా వేశామని ఈ గడువు ముగుస్తున్నప్పటికీ ఇరు పార్టీల నుంచీ తగిన స్పందన లేదని ట్రంప్ తెలిపారు.
ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం రూపొందించిన ప్రణాళిక ప్రకారం దేశంలోని లాస్ఏంజెల్స్, హోస్టన్, చికాగో, మియామీ, న్యూయార్క్ , శాన్ఫ్రాన్సిస్కో తదితర పది నగరాల్లో అక్రమంగా ఉంటున్న వలసదారులు దాదాపు 2 వేల మందికి పైగా ఉన్నారని వారందరిని వెనక్కి పంపుతామని ట్రంప్ అన్నారు.అయితే ఈ చర్యల పట్ల చాలా నగరాలలో మేయర్లు సహకరించబోమని ప్రకటించినట్లుగా తెలుస్తోంది.