ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన అమెరికా అధ్యక్ష ఎన్నికలు రానే వచ్చేశాయి.తుది పోరు ఈ రోజే జరగనుంది.
ఇప్పటికే ఇరు పార్టీల అభ్యర్ధులు ప్రచారాలను ముగించుకునే పనిలో ఉన్నారు.గెలుపు ఎవరిదీ, ఎవరు అమెరికా అధ్యక్ష భవనంలో కాలు మోపనున్నారు అనే ఉత్కంటకు తెరపడే సమయం ఆసన్నమయ్యింది.
ఈ క్రమంలోనే బిడెన్ తన ప్రచారానికి శుభం కార్డ్ పెట్టె క్రమంలో ట్రంప్ పై సంచనల వ్యాఖ్యలు చేశారు.చివరి రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఒహియో రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిడెన్ ఇక తట్టా బుట్టా సర్దేసుకోవడమే ట్రంప్ అంటూ వ్యాఖ్యానించారు.
ట్రంప్ చేసిన తప్పులకు మూల్యం చెల్లించుకునే రోజు రానే వచ్చేసింది.ట్రంప్ హయాంలో ఊహించని విధంగా అమెరికాలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.ఎన్నో గొడవలు, మరెన్నో నిరసనలు, ఇవన్నీ ట్రంప్ హయాంలో జరగడం, బయటి దేశాలకు మనం చులకన కావడం జరుగుతోందని ట్రంప్ అమెరికా పరువు తీసేశారని ఆరోపించారు.కరోనాను ఎదుర్కోనలేని ట్రంప్, కనీసం సరైన సమయంలో వ్యాక్సిన్ కూడా ప్రజలకు అందించలేక పోయారని దుమ్మెత్తి పోశారు బిడెన్…ఇక ట్రంప్ పాలనకు ముగింపు పలికే రోజు వచ్చిందని, అందరూ సిద్దంగా ఉండాలని పులుపునిచ్చారు.
ట్రంప్ వైట్ హౌస్ వదిలి ఇంటికి వెళ్ళే సమయం వచ్చేసిందని, అర్థం లేని ట్వీట్లకు, పిచ్చి పిచ్చి అరుపులకు, కోపానికి, ద్వేషానికి, వైఫల్యానికి, బాధ్యతారాహిత్యానికి, అధికారులపై చేసే ఆరోపణలకు కాలం చెల్లిందని బిడెన్ అన్నారు.మీ అంగీకారంతో నేను అధికారంలోకి వస్తే ముందుగా కరోనాని అమెరికా నుంచి తరిమికొట్టే ప్రయత్నాలు చేస్తానని ప్రజలకు త్వరలోనే వ్యాక్సిన్ వచ్చేలా చర్యలు చేపడుతానని హామీ ఇచ్చారు.