ఏ వ్యాధికైనా చికిత్స అందించాలంటే దానిని ముందుగా గుర్తించగలగాలి.ప్రస్తుతం కరోనా రోగులను గుర్తించడానికి ప్రపంచం నానా తంటాలు పడుతోంది.
వ్యాధి సోకిన తర్వాత 14 రోజులకు గాని దీని జాడలు బయటపడుతుండటంతో నిపుణులు తలలు పట్టుకుంటున్నారు.ఈ లోగా కరోనా సోకిన వారు రోడ్లపైకి తిరిగి, మిగతా వారిని దీనిని అంటిస్తున్నారు.
దీంతో కరోనాను వేగంగా గుర్తించే విధానాలపై శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేస్తున్నారు.
అయితే కరోనా వైరస్ రోగులను గుర్తించేందుకు కుక్కలు ఎలా ఉపయోగపడతాయో అన్న దానిపై బ్రిటన్ రాజధాని లండన్కు ఉత్తరాన ఉన్న గ్రేట్ హార్వుడ్లోని మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీ, లండన్ స్కూల్ ఆఫ్ హైజీన్ అండ్ ట్రాపికల్ మెడిసిన్ సంస్థలు ఈశాన్య ఇంగ్లాండ్లోని డర్హమ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలతో కలిసి పరిశోధనలు చేస్తున్నాయి.
వాసన ద్వారా కుక్కలు వివిధ వ్యాధిగ్రస్తులను గుర్తిస్తున్న నేపథ్యంలో కరోనాను కూడా అవి గుర్తించేలా వాటికి ఆరు వారాల శిక్షణను ఇవ్వాలని సైంటిస్టులు భావిస్తున్నారు.
ప్రతీ వ్యాధికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుందని అందువల్ల కరోనా వైరస్ సోకిన వారిని గుర్తించే సామర్ధ్యం జాగిలాలకు ఏ మేరకు ఉంటుందో పరీక్షిస్తున్నారు.పార్కిన్సన్, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాధిగ్రస్తుల రోగుల నుంచి తీసిన నమూనాలను కుక్కలకు వాసన చూపించి ఇలాంటి వ్యాధులను గుర్తించేలా మెడికల్ డిటెక్షన్ డాగ్స్ ఛారిటీ సంస్థ గతంలో శిక్షణ ఇచ్చింది.
అదే సమయంలో ఓ వ్యక్తికి జ్వరం ఉందో లేదో కూడా జాగిలాలు గుర్తించగలవని, అదే సామర్ధ్యంతో కరోనా సోకిన వారిని కూడా వాసన ద్వారా సులభంగా గుర్తించగలవని ఛారిటీ వ్యవస్థాపకుడు, క్లైర్ గెస్ట్ తెలిపారు.
గతంలో కుక్కలు ప్రాణాంతకమైన మలేరియాను గుర్తించాయని, శ్వాసకోశ వ్యాధి అయిన కరోనా వైరస్ను గుర్తించే సత్తా జాగిలాలకు ఉందని గెస్ట్ ఆశాభావం వ్యక్తం చేశారు.తమ ప్రయోగం విజయవంతమై కరోనా వైరస్ సోకిన రోగులను గుర్తిస్తే దీనిని వేగంగా నివారించవచ్చునని పరిశోధకులు భావిస్తున్నారు.