నాటు బాంబుల గురించి మీరు వినే ఉంటారు.నల్లమందును ఉపయోగించి ఈ నాటు బాంబులను తయారు చేస్తారు.
ప్రత్యర్థుల మీద బాంబులు విసిరే సీన్స్ ను సినిమాల్లో చాలానే చూసి ఉంటాము.బాంబు పేలినప్పుడు పెద్ద శబ్దం కూడా వస్తుంది.
అయితే ఇలా నాటుబాంబులు తయారు చేయడం గాని, వాటిని వాడడం కానీ చట్టరీత్యా నేరం.కానీ కొన్ని మారుమూల గ్రామాల్లో ఇప్పటికీ నాటుబాంబులను తయారు చేస్తూనే ఉన్నారు.
ఈ నాటుబాంబు వలన పాపం అన్యం పుణ్యం ఎరగని ఒక మూగజీవి బలి అయిపోయింది.ఈ నాటుబాంబులను అడవి పందులను వేటాడడం కోసం తయారు చేస్తుంటారు.
తాజాగా చిత్తూరు జిల్లా నిమ్మనపల్లి మండలం ముస్టూరు పంచాయతీలో నాటుబాంబులు కలకలం రేపాయి.ఆ పంచాయితీ పరిధిలోని కొత్తవలసపల్లికి చెందిన పేరం పెద్ద రెడ్డప్ప, శ్రీనివాసులు అనే ఇద్దరు వ్యక్తులు అడవిపందుల వేట కోసం పలమనేరు ప్రాంతం నుంచి నల్ల మందు తెప్పించి నాటు బాంబులు తయారు చేసి అడవి పందుల వేట కోసం ఆ నాటు బాంబులను వినియోగిస్తుంటారు.
అయితే శనివారం ఉదయం పెద్ద రెడ్డప్ప తన ఇంటిపైన తయారు చేసి ఉంచిన నాటుబాంబులను ఎండలో ఆరబెట్టడం జరిగింది.వాటిని చూసిన ఒక కాకి అవేవో తినేవి అనుకుని ఒక నాటు బాంబును కాకి తన నోట కరుచుకుని వేరే ఇంటి సమీపంలో కింద పడేసింది.
అలా కింద పడిన నాటు బాంబును పాపం ఒక కుక్క చూసి దాన్ని కొరకింది.అంతే ఆ నాటు బాంబు పేలి అక్కడికక్కడే ఆ కుక్క చనిపోయింది.
బాంబు ఒక్కసారిగా పేలడంతో పెద్దగా శబ్దం వచ్చింది.ఆ శబ్దానికి అక్కడ గల స్థానికులు భయపడి పోలీసులకు సమాచారం చేరవేశారు.సమాచారం తెలుసుకున్న ఏఎస్సై సురేంద్ర తన సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి వచ్చారు.అయితే పోలీసుల రాకను పసిగట్టిన నిందితులు పెద్ద రెడ్డప్ప, శ్రీనివాసులు వాళ్ళు తయారుచేసిన నాటు బాంబులను ఒక డబ్బాలో పెట్టి భద్రపరిచేందుకు వేరే చోటికి పారిపోతుండగా వాళ్ళని వెంబడించి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
అలాగే నిందితులపై కేసు నమోదు చేయడంతో పాటు వారి దగ్గర నుంచి పది నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు.ఆ బాంబు పేలినప్పుడు అక్కడ మనుషులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పాలి… కానీ మానవ తప్పిదానికి ఒక మూగజీవి ప్రాణం పోయింది.