ఎన్నికల ప్రచారం లో ఆవేశంగా మాట్లాడడం, అనంతరం సరదా సరదాగా అందరితోనూ కలుపుగోలుగా ఉండడం పవన్ స్టైల్.ఏపీలో అనేక ప్రాంతాల్లో జనసేన పార్టీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించిన పవన్ ఈ ఎన్నికల్లో పార్టీ ఖచ్చితంగా గెలుస్తుంది అనే ధీమాతోనే ఉంటూ ఖచ్చితంగా సీఎం అవుతా అంటూ గట్టిగా మాట్లాడాడు.
కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నట్టు పోలింగ్ అనంతరం పవన్ కి అర్ధం అయ్యింది.టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సైతం మీడియా ముందుకు వచ్చారు.
ఈవీఎంల పనితీరును తప్పుపట్టారు.సైలెంట్ వేవ్ తమకే ఉందని చెప్పారు.
మే 23వ తర్వాత మంచి ముహూర్తం చూసుకుని సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని చంద్రబాబు చెప్పారు.ఇక వైసీపీ అధినేత జగన్ అయితే పోలింగ్ జరిగిన రోజు రాత్రే మీడియా ముందుకు వచ్చారు.
తమ పార్టీకే ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారని తేల్చి చెప్పారు.ప్రజలు తమ వైపే మొగ్గు చూపారన్నారు.కానీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం పోలింగ్ అనంతరం సైలెంట్ గానే ఉన్నారు.దీనికి కారణాలు ఆలోచిస్తే తాను ఆశించినట్లు కాపు సామాజికవర్గం ఓట్లు తమ ఖాతాలో పడలేదు అనే భావన పవన్ లో బాగా ఏర్పడినట్టు అర్ధం అవుతోంది.
కేవలం 30 ఏళ్ల వయస్సులోపు ఉన్న కాపు యువకులే పవన్ పార్టీ పట్ల ఆకర్షితులయ్యారు తప్ప, మిగిలిన కాపు సామాజిక వర్గం ఓట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయన్న అనుమానం ఆయనలో ఉన్నట్టు కనిపిస్తోంది.
ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలపై పవన్ కల్యాణ్ ఆశలు పెట్టుకున్నారు.కానీ అక్కడ పోలింగ్ సరళిని పరిశీలిస్తే కాపు సామాజిక వర్గం ఓట్లు ఎక్కువగా వైసీపీ వైపు వెళ్లిపోయాయి.దీనికి ప్రధాన కారణం తెలుగుదేశం పార్టీ కాపుల పట్ల గత నాలుగున్నరేళ్లుగా వ్యవహరించిన తీరు, పవన్ పార్టీ పెద్దగా బలంగా లేకపోవడంతో వారు వైసీపీకి చివరి నిమిషంలో అనుకూలంగా మారారంటున్నారు.
అందువల్లనే పవన్ పార్టీకి ఈ జిల్లాల్లోనూ పెద్దగా సీట్లు వచ్చే కనిపించడంలేదు.అందుకే పవన్ ఈ రాజకీయ పరిస్థితుల్లో ఏ విధంగా స్పందించాలో తెలియక సైలెంట్ గా ఉన్నట్టు కనిపిస్తోంది.