అసలే ఇది ఎన్నికల సమయం.ఈ సమయంలో ప్రతి అంశం ఓటర్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
సున్నితమైన అంశాలు అయితే ఆ ప్రభావం మరీ ఎక్కువగా ఉంటుంది.ఇక ఏపీ లో ఎన్నికలకు పదిహేను రోజుల సమయం కూడా లేదు.
అందుకే వివిధ పార్టీల అధినేతలంతా ఏపీ మొత్తం సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.నిత్యం బిజీ బిజీగా గడుపుతూ తీరిక లేకుండా ఉన్నారు.
ఈ సమయంలో ఏపీలో చోటుచేసుకున్న పరిణామాలు ఆయా పార్టీలను కలవరపెడుతున్నాయి.పూర్తిగా ఎన్నికల ప్రచారం మీద ఉండాల్సిన దృష్టంతా వేరే విషయాల మీదకు మళ్లుతోంది.
ఇప్పుడు ఏపీ రాజకీయాలను ప్రభావితం చేయబోయేది ఏపీ హైకోర్టు కావడంతో నాయకుల ద్రుష్టి అంతా ఇక్కడే ఉంది.
ఏపీ రాజకీయాలను, ఎన్నికలను ప్రభావితం చేయగలిగిన ముఖ్యమైన మూడు కేసులు హైకోర్టులో ఉండటంతో ఆ కేసుల్లో తీర్పులు ఏ విధంగా వస్తాయో అన్న ఆందోళన, ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
దీంతో పార్టీల ప్రచారం కంటే హైకోర్టుకే ఎక్కువ ప్రాధాన్యత ఏర్పడింది.మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు వ్యవహారం ప్రస్తుతం హైకోర్టులోనే ఉంది.
తన చిన్నాన్నను టీడీపీ వారే చంపించారని జగన్, కాదు జగనే చంపించాడని చంద్రబాబు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు.ఈ హత్యను చంద్రబాబు ఒక ప్రచారాస్త్రంగా వాడుకున్నారు.రాష్ట్ర పోలీసులు విచారణ జరిపిస్తే తమకు న్యాయం జరగదని, థర్డ్ పార్టీతో విచారణ చేయించాలని వివేకా భార్య సౌభాగ్యమ్మ, జగన్ హైకోర్టులో పిటిషన్లు వేశారు.ఈ పిటిషన్లను కోర్టు విచారణ చేస్తోంది.
అలాగే ఇంటెలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావును ఎన్నికల సంఘం బదిలీ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం హైకోర్టు లో పిటిషన్ వేసింది.ఇంటెలిజెన్స్ ఎన్నికల సంఘం పరిధిలోకి రాదని ప్రభుత్వం కొత్త వాదనను తెరమీదకు తెచ్చింది.ఇది తమ పరిధిలోకే వస్తుందని ఎన్నికల సంఘం వాదిస్తోంది.దీనిలో వైసీపీ కూడా ఇంప్లీడ్ కావడంతో పూర్తిగా రాజకీయాలు ముడిపడి ఉన్నాయి.ఈ విషయంలో ఏ తీర్పు వచ్చినా ఎన్నికలపై ఎంతో కొంత ప్రభావం ఖచ్చితంగా కనిపిస్తుంది.ఇక మూడో కేసు విషయానికి వస్తే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా వ్యవహారం.
ఇది కూడా హైకోర్టులోనే ఉంది.ఈ సినిమాలో రాజకీయ దురుద్దేశ్యాలు ఉన్నందున ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలని టీడీపీ కోర్టుకెక్కింది.
దీని కారణంగా విడుదల కావాల్సిన సినిమాపై ఏప్రిల్ 3 వరకు స్టే ఇచ్చింది.దీనిపైనా తీర్పు ఆ తేదీనే వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఈ మూడు కేసుల ప్రభావం ఖచ్చితంగా ఏపీ రాజకీయాల మీద ఉంటుంది.