తెలుగుదేశం పార్టీలో లోపాలపై ఇప్పుడు ఒక్కొక్కరుగా టిడిపి సీనియర్ నేతలు తమ గళం వినిపిస్తున్నారు.అధినేత చంద్రబాబుకు నేరుగా చెప్పేందుకు ప్రయత్నించినా ఫలితం కనిపించకపోవడంతో మీడియా ముందుకు వచ్చి పార్టీ దుస్థితిని ఏకరువు పెడుతున్నారు.
ఆషామాషీగా, గతంలో మాదిరిగా తెలుగుదేశం పార్టీ పరిస్థితిని ఊహించుకుంటే మళ్లీ అధికారంలోకి రావడం కష్టమని , పార్టీలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యం ఇస్తూనే సీనియర్ ల సలహాలను గౌరవిస్తూ , పార్టీ కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని పదేపదే పార్టీ సీనియర్ నాయకులు కొంతమంది చంద్రబాబు చెవిన వేసే ప్రయత్నం చేస్తున్నారు.అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని, పార్టీలో యువ నాయకులు ప్రాధాన్యాన్ని చంద్రబాబు పెంచుతున్నారు. వారి రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని , పార్టీలో యువ నాయకులు ప్రాధాన్యాన్ని చంద్రబాబు పెంచుతున్నారు.వారే ముందు ముందు లోకేష్ కు బాగా ఉపయోగపడతారని, సీనియర్ నాయకులు ఉన్నా, పార్టీలో పెద్దగా ఉపయోగం లేదనే ఒక అంచనాకు వచ్చారు.
ఇక ఎప్పటి నుంచో పార్టీ కార్యకర్తలను పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలు చంద్రబాబుపై ఉన్నాయి.ఈ అంశంపై కొద్ది రోజుల క్రితం టిడిపి సీనియర్ నేత రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి బహిరంగంగానే చంద్రబాబు తీరును తప్పు పట్టారు.
కొంతమంది నాయకుల మాటలు మాత్రమే వింటూ, పార్టీకి అన్యాయం జరిగే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని, ఈ తీరు సరికాదని ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించారు.పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా కార్యకర్తలకు పెద్దపీట వేయాలని ఆయన కోరారు.
టీడీపీలో అత్యంత సీనియర్ గా ఉన్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాటలకు చంద్రబాబు కు కోపం రాలేదు సరికదా, ఆయనను బుజ్జగించి మరి ఆయన మాటలను శ్రద్ధగా ఆలకించారు.బుచ్చయ్య చెప్పినట్లుగానే చేయకపోతే నిజంగానే పార్టీకి భవిష్యత్తు ఉండదు అనే అభిప్రాయము చంద్రబాబు లోనూ కలిగింది.తాజాగా అనంతపురం జిల్లా కీలక నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పార్టీ ఈ విషయంలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారు తరువాత తమను తాము కాపాడుకునేందుకే ప్రయత్నాలు చేశారు తప్ప, కార్యకర్తలను పట్టించుకోలేదని బహిరంగంగా విమర్శించారు.
వీరిద్దరే కాదు పార్టీలో చాలామంది సీనియర్ నాయకులు ఈ తరహా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.వలస నాయకులకు ఇస్తున్న ప్రాధాన్యం , టిడిపిని కాపాడుకుంటూ మొదటి నుంచి అండగా నిలబడిన వారికి ఏమాత్రం పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదంటూ అసంతృప్తితోనే ఉన్నారు.
ముఖ్యంగా కార్యకర్తలను పట్టించుకోకపోతే టిడిపి ఎప్పటికీ అధికారంలోకి రాలేదు అనే అభిప్రాయాన్ని పార్టీ సీనియర్లు వ్యక్తం చేస్తున్నారు.
.