తెలంగాణ లో రాజకీయ సునామీ సృష్టించేందుకు ఎన్నో ఆశలతో వైఎస్ షర్మిల పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు .టిఆర్ఎస్ పార్టీని ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.
అలాగే బిజెపి కాంగ్రెస్ పార్టీలను సైతం వదిలిపెట్టకుండా విమర్శలు చేస్తున్నారు.ప్రతి విషయం పైన ఆమె స్పందిస్తున్నారు.
నిలదీస్తున్నారు.ఉద్యోగుల సమస్యలపై పోరుకి దిగారు.
ఇలా తెలంగాణలో ఏ ప్రజా సమస్య అయినా ఆ విషయంలో షర్మిల యాక్టివ్ గా స్పందిస్తున్నారు.కేసీఆర్ దొర అంటూ తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు.
వాస్తవంగా షర్మిల పార్టీ పెట్టిందే టిఆర్ఎస్ పార్టీ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను చీల్చేందుకు అని, కేసీఆర్ ఆమె వెనుక ఉండి ప్రోత్సహిస్తున్నారని, ఆయన సూచనలతో పార్టీ పెట్టారని విమర్శలు లేకపోలేదు.ఇక షర్మిల పదేపదే టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, కేసీఆర్ దొర అంటూ వెటకారంగా వివిధ సమస్యలపై నిలదీస్తున్నారు.
అయినా టిఆర్ఎస్ నుంచి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు.
మొదట్లో టిఆర్ఎస్ మంత్రి గంగుల కమలాకర్ వంటివారు షర్మిల పై తీవ్ర స్థాయిలో విమర్శ చేసినా, ఆ తర్వాత ఆయన సైలెంట్ అయిపోయారు.
బిజెపి కాంగ్రెస్ లపై విమర్శలు చేస్తున్నా, వారు పెద్దగా స్పందించడం లేదు.అసలు తాను పార్టీ పెడితే టిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించే వారంతా తమ వైపు వస్తారని, అలాగే బిజెపి కాంగ్రెస్ లో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్న వారంతా తనకు మద్దతు ఇస్తారని, త్వరలో తాను ఏర్పాటు చేయబోయే పార్టీలో చేరుతారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.
కానీ ఎక్కడా అది కార్య రూపం దాల్చేలా కనిపించడం లేదు.
తెలంగాణలో షర్మిల పార్టీని, నాయకులు పెద్దగా పట్టించుకోవడం లేదని, కొంతకాలం పాటు ఆమె హడావుడి చేసి తర్వాత సైలెంట్ అయిపోతారు అనే అభిప్రాయం ఉండటంతో, అనవసరంగా ఆమె పార్టీలో చేరితే రాజకీయ భవిష్యత్తు కోల్పోతామనే ఉద్దేశం చాలా మందిలో ఉంది.
ఇలా ఎన్నో కారణాలతో సైలెంట్ గా ఎవరికి వారే ఉన్నట్టు గా కనిపిస్తున్నారు.ఆమె పార్టీ పేరును ప్రకటించినా, పెద్దగా చేరికలు అయితే ఉండేలా కనిపించడం లేదని, ఏపీలో జనసేన పార్టీ తరహాలోనే షర్మిల పార్టీ ఉంటుంది అనే రాజకీయ అంచనాలు మొదలయ్యాయి.