భరతమాతను బ్రిటీష్ దాస్య శృంఖలాల నుంచి విడిపించేందుకు ఎందరో మహనీయులు పోరాటాలు చేశారు.తమ జీవితాలను, ఆస్తులను, సర్వస్వం త్యాగం చేశారు.
వీరిలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ( Netaji Subhash Chandra Bose )ఒకరు.గాంధీ, నెహ్రూ, పటేల్ వంటి వారు అహింసా మార్గంలో స్వాతంత్య్ర పోరాటం చేస్తే.
భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ తదితరులు విప్లవ పంథాను అనుసరించారు.అలా బ్రిటీష్ వారిని గడగడలాడించిన యోధుడు సుభాస్ చంద్రబోస్.
రెండుసార్లు భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షుడిగా ఎన్నికైనా గాంధీజీతో సిద్ధాంతపరంగా విభేదించి ఆ పదవికి రాజీనామా చేశారు.కాంగ్రెస్కు పోటీగా ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ అనే రాజకీయ పార్టీని స్థాపించారు.
అదే ఊపులో ఆజాద్ హిందూ ఫౌజ్ను( Azad Hindu Fauz ) స్ధాపించి ఆర్మీ ద్వారా బ్రిటీష్ వారిపై పోరాడారు.
అయితే అంతటి దేశభక్తుడి మరణం నేటికీ ఒక మిస్టరీయే.1945 ఆగస్టు 22న నేతాజీ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురై కూలిపోవడంతో ఆయన వీరమరణం పొందినట్లుగా జపాన్ రేడియో అధికారికంగా ప్రకటించింది.కానీ దీనిపై అనేక అనుమానాలు వున్నాయి.
కేంద్ర ప్రభుత్వం బోస్కి సంబంధించిన వందలాది సీక్రెట్ ఫైళ్లను బహిర్గతం చేసినప్పటికీ ఆయన మరణం వెనుక కారణాలు ఇప్పటికీ ఓ మిస్టరీలానే మిగిలిపోయింది.

కాగా.1943 జూలైలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ అప్పటి జపాన్ అక్రమిత సింగపూర్లోని పడాంగ్లో నిర్వహించిన ‘‘ఢిల్లీ చలో’’( Delhi Chalo ) కార్యక్రమం చారిత్రాత్మకమైనది.తాజాగా దీనిపై రూపొందించిన డాక్యుమెంటరీని శుక్రవారం ప్రదర్శించనున్నారు.
‘‘Netaji Subhas Chandra Bose: A Singapore Saga’’ పేరుతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు.ఢిల్లీ కేంద్రంగా కవాతు చేయాలని, భారతదేశం నుంచి బ్రిటీష్ వలస ప్రభుత్వాన్ని తరిమికొట్టాలని బోస్ ఆనాడు పిలుపునిచ్చారు.
నేతాజీ ప్రసంగం ఈ ప్రాంత ప్రజలను ఉత్తేజపరిచాయి.

ఈ డాక్యుమెంటరీ భారత్, సింగపూర్ల మధ్య పెనవేసుకున్న చరిత్ర, బలమైన సాంస్కృతిక సంబంధాలను గుర్తుచేయనుంది.ఠాగూర్ సొసైటీ సింగపూర్ ద్వారా కమీషన్ చేయబడిన ఈ డాక్యుమెంటరీకి లక్ష్మీరామన్ వెంకట్ దర్శకత్వం వహించారు.సొసైటీ క్రియేటివ్ డైరెక్టర్ డాలీ డావెన్పోర్ట్ మాట్లాడుతూ.
ఈ ప్రాంత ప్రజలు నేతాజీ పట్ల ఎలా ప్రభావితమయ్యారనే దానిపై డాక్యుమెంటరీలో వివరించారని పేర్కొన్నారు.







