కొంత మంది రోగులు ఆసుపత్రులకు వెళ్లినప్పుడు వారికి ఉన్న రోగం ఏమిటో తెలుసుకోవడం వైద్యులకు కష్టం అవుతుంది.అయితే ఎక్స్ రే, స్కానింగ్ వంటివి తీసినప్పుడు అసలు విషయం బయటపడుతుంది.
ఇలాంటి సందర్భాలలో ఏదో ఒక స్పూను, రబ్బరు బ్యాండు, నాణేలు, పిన్నీసులు వంటివి మింగి ఉంన్న వారిని గమనించి ఉంటాం.అయితే ఇటీవల వైద్యులు ఓ రోగి విషయంలో ఆశ్చర్యపోయారు.
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 63 స్పూన్లు అతడి కడుపులో ఉండడం చూసి ఖంగుతిన్నారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఓ వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు అతని కడుపులో 63 చెంచాలను కనుగొన్నారు.విజయ్ కుమార్ (32) అనే వ్యక్తి తీవ్ర కడుపునొప్పితో బాధ పడుతుండడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రెండు గంటలపాటు ఆపరేషన్ చేశారు.
శస్త్రచికిత్స అనంతర కోలుకోవడం కోసం ఐసియులో రోగిని ఉంచారు.అయితే అతడి కడుపులోకి స్పూన్లు ఎలా వెళ్లాయనే దానిపై వైద్యులు ఆరా తీశారు.అతడు డ్రగ్ ఎడిక్ట్ అని తెలిసింది.అయితే డీ అడిక్షన్ సెంటర్లో వైద్యులు, సిబ్బంది తనను స్పూన్లు తినమని ప్రోత్సహించారని బాధితుడు పేర్కొన్నారు.
పేషెంట్ మేనల్లుడు అజయ్ చౌదరి కూడా దీనిపై స్పందించారు.“మా మామయ్య తీవ్రమైన కడుపునొప్పితో బాధ పడుతుండడంతో అతని కడుపులో అనేక స్పూన్లు ఉన్నట్లు స్కానింగ్లో నిర్ధారణ అయింది.దీంతో మేము మా మామను హాస్పిటల్కు తీసుకువచ్చాము.మేము అతన్ని ఒక సంవత్సరం క్రితం డి అడిక్షన్ సెంటర్లో చేర్చాము.అక్కడ అతను ఈ స్పూన్లను తిన్నట్లు అనుమానిస్తున్నాం” అని చెప్పాడు.ఇప్పటి వరకు ఈ వ్యవహారంపై పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేయలేదు.
రోగి ఈ చెంచాలను ఎప్పుడు మింగాడో కచ్చితంగా చెప్పలేమని వైద్యులు తెలిపారు.